మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి( Mothkur Municipal Chairman Theepireddy Savitri )పై శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి,భువనగిరి ఆర్డీవో ఎన్.అమరేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ సమక్షంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
జనవరి 20 న 9 మంది కౌన్సిలర్లు చైర్మన్ సావిత్రిపై అవిశ్వాసం కోరుతూ జిల్లా కలెక్టర్ కు తీర్మానం కాపీ అందించగా,జిల్లా కలెక్టర్( District Collector ) ఆదేశాల మేరకు చైర్మన్ తో సహా 12మంది కౌన్సిలర్లకు అవిశ్వాసం నోటీసులు అందజేసినట్లు ఆర్డీవో తెలిపారు.అవిశ్వాసం కోసం 2/3 వంతు ప్రకారం 8 మంది కౌన్సిలర్ల కోరమ్ ఉండాల్సినప్పటికీ 10 మంది కౌన్సిలర్లు(5గురు బీఆర్ఎస్,5గురు కాంగ్రెస్) అవిశ్వాస సమావేశానికి 5 నిమిషాల ముందే సమావేశ హాల్లోకి చేరుకున్నారు.7 వార్డు కౌన్సిలర్,చైర్మన్ సావిత్రి, 10 వ వార్డు కౌన్సిలర్ బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి గైర్హాజరు కాగా,మిగతా 10 మంది కౌన్సిలర్లు ఆర్డీవో( RDO ) ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తడంతో మెజార్టీ సభ్యుల తీర్మానం ఆమోదం మేరకు అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ అమరేందర్ అధికారికంగా ప్రకటించారు.తదుపరి చర్యల నిమిత్తం నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్ కు సమర్పించనున్నట్లు తెలిపారు.
నూతన చైర్మన్ ఎన్నిక కోసం జిల్లా కలెక్టర్ ఎన్నికల కమిషన్ కు నివేదించిన అనంతరం ప్రభుత్వ నిర్ణయం మేరకు చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామన్నారు.అవిశ్వాస సమావేశం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేందుకు చౌటుప్పల్ ఏసిపి మొగులయ్య,రామన్నపేట సిఐ ఎన్.వెంకటేశ్వర్లు నేతృత్వంలో స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 మంది సివిల్,సిఆర్పీఎఫ్ పోలీసుల( CRPF Police )తో భారీ బందోబస్తు నిర్వహించారు.అవిశ్వాస సమావేశం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.