ఫేస్బుక్లో షేర్ చేసిన ఒక విషాదకర ఘటన ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తుంది.ఈ ఘటనలో పెట్రోల్ లేకపోవడం వల్ల ఒక చిన్నారి మరణించింది.
ఈ దుర్ఘటన శ్రీలంక లో చోటుచేసుకుంది.ఇంధన కొరత కారణంగా శ్రీలంక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
అయితే ఈ ఇంధన కొరత ఒక బాలిక పాలిట యమపాశం అయింది.వివరాల్లోకి వెళితే… శ్రీలంకలోని కొలంబోకి 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న హల్దాముల్లాలో ఒక కుటుంబం నివసిస్తోంది.
అయితే ఈ కుటుంబం లోని ఒక చిన్నారి ఇటీవల పచ్చకామర్ల బారిన పడింది.కొద్దిరోజుల నుంచి ఆ అమ్మాయి ఏమీ తినడం లేదు.
చాలా రోజులుగా ఆ అమ్మాయి ఆహారం తినడం పూర్తిగా మానేసింది.
ఇటీవల ఆ చిన్నారి పరిస్థితి మరింత విషమంగా మారింది.
దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులు ఎంతో తపన పడ్డారు.కానీ పెట్రోల్ కోసం ఎంత ప్రయత్నించినా ఒక్క చుక్క కూడా దొరకలేదు.
పెట్రోల్ దొరికితే ఆటో లో చిన్నారిని ఆస్పత్రికి తీసుకు వెళ్లొచ్చని తల్లిదండ్రులు గంటలకొద్దీ అన్ని ప్రదేశాల్లో అన్వేషించారు.అయితే చివరికి పెట్రోల్ దొరికింది కానీ హాస్పిటల్కు తీసుకెళ్లేలోపే శిశువు కన్నుమూసింది.
కనీసం ఒక్క లీటర్ పెట్రోల్ లభించినా తన బిడ్డ ప్రాణాలు దక్కేవని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నట్టు ఒక వైద్యుడు ఫేస్బుక్లో ఒక పోస్ట్ షేర్ చేశాడు.దీన్ని చూసిన నెటిజన్లు మరింత భావోద్వేగానికి లోనవుతున్నారు.
శ్రీలంక దేశంలో ఇంధనం ఒక్కటే కాదు అన్ని ఆహార పదార్థాలు, వస్తువులు దొరకడం దాదాపు అసాధ్యంగా మారింది.ఒకవేళ దొరికినా వీటి ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.
దీంతో లంకేయుల పరిస్థితి ప్రత్యక్ష నరకంగా మారింది.