కేంద్ర కేబినెట్ ను ఈరోజు కానీ, లేక రేపు కానీ విస్తరించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.ఈ మేరకు ఢిల్లీలో హడావుడి మొదలు అయిపోయింది.
కేంద్ర క్యాబినెట్ ను విస్తరిస్తారు అనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించాల్సిన కీలక సమావేశంను రద్దు చేసుకున్నారు.పార్టీ కీలక నాయకులు సీనియర్లతో క్యాబినెట్ విస్తరణ పై చర్చించేందుకు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నా, దానిని వాయిదా వేసుకున్నారు.
క్యాబినెట్ విస్తరణపై నిన్ననే అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్తో సమావేశం అయ్యి ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది .
ప్రస్తుతం మోదీ కేబినెట్ లో ఇరవై ఎనిమిది మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది.ఇప్పుడు కనీసం 20 మందికి పైగా మంత్రి పదవులు వరించే అవకాశం కనిపిస్తోంది.2022 జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 2024 జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్ ను విస్తరించబోతున్నట్టు తెలుస్తోంది.మహారాష్ట్ర, యూపి, పశ్చిమ బెంగాల్ కు అవకాశం కల్పించబోతున్నట్టు సమాచారం.ఇప్పటికే మంత్రి వర్గం లో ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కేంద్ర మంత్రి పదవులకు ఎంపిక చేసిన ఎంపీలకు ఇప్పటికే సమాచారం అందినట్లు తెలుస్తోంది.వారంతా ఢిల్లీకి క్యూ కడుతుండడంతో వాతావరణం సందడిగా మారింది.
రేపు లేదా ఎల్లుండి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండొచ్చని, అందరూ ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఇప్పటికే సదరు ఎంపీలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.దీంతో హుటాహుటిన సదరు ఎంపీలు ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు.బిజెపి అగ్రనేతలు మంచి సమాచారం అందిన ఎంపీలే కాకుండా, తమకు మంత్రి పదవులు ఇవ్వాలని ఒత్తిడి చేసేందుకు మరికొంతమంది ఎంపీలు ఢిల్లీ బాట పడుతున్నారు.
.