ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాలను ఓ అంశం కుదిపేసింది.అదే డేటా చోరీ కేసు.
ఏపీలోని ఓటర్ల వివరాలను అప్పటి అధికార పార్టీ టీడీపీ చోరీ చేస్తోందని లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.
గుంటూరు వెళ్లి ఐటీ గ్రిడ్ అనే సంస్థకు చెందిన ఉద్యోగులను అరెస్ట్ చేశారు.

తమ ఓటర్ల డేటాను టీడీపీ చోరీ చేస్తోందని వైసీపీ.లేదు తమ డేటానే తెలంగాణ పోలీసులు ఎత్తుకెళ్లి వైసీపీకి ఇచ్చారని టీడీపీ ఆరోపణలు చేసుకున్నారు.అత్యంత రహస్యంగా ఉండాల్సిన ఆధార్ డేటా చోరీ కేసు కావడం, అదీ ఎన్నికల ముందు ఇలా జరగడంతో అప్పట్లో ఈ కేసు రెండు రాష్ట్రాలను కుదిపేసింది.
అయితే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కేసుల్లాగే ఈ కేసు కూడా అటకెక్కింది.

తాజాగా మరోసారి ఇది తెరపైకి వచ్చింది.ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు.అసలు ఐటీ గ్రిడ్ సంస్థ ద్వారా టీడీపీ ఓటర్ల డేటా చోరీ చేస్తోందని కేసు పెట్టారని, ఆ కేసు ఏమైందని ఆయన ప్రశ్నించారు.
నిజంగా ఆధార్ డేటా చోరీకి గురయిందా లేదా అన్న అంశంపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు.దీనికి కేంద్ర మంత్రి సంజయ్ ధోత్రే సమాధానమిచ్చారు.అసలు ఆధార్ డేటా చోరీ జరిగే అవకాశమే లేదని ఆయన తేల్చి చెప్పారు.

దీంతో అప్పుడు తెలంగాణ పోలీసులు పెట్టిన కేసుపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పార్లమెంట్ సాక్షిగా డేటా చోరీ జరగలేదని కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించడంతో ఆ కేసు దురుద్దేశపూరితంగా పెట్టిందే అంటూ టీడీపీ ఆరోపిస్తోంది.ఈ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించిన తెలంగాణ పోలీసులు, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఏం సమాధానం చెబుతుందో చూడాలి.