ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో (Melbourne, Australia,)ఉన్న భారత కాన్సులేట్ను (Indian Consulate)లక్ష్యంగా చేసుకుని విద్వేష దాడి జరగడం కలకలం రేపుతోంది.కాన్బెర్రాలోని భారత హైకమీషన్ శుక్రవారం ఆస్ట్రేలియా అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లింది.
మెల్బోర్న్లోని భారత కాన్సులేట్ ప్రాంగణం గతంలో ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు వేదికగా నిలిచిందని తెలిపింది.గడిచిన కొన్నేళ్లలో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో కొందరు ప్రాంగణంలో అలజడులు సృష్టించారని ది ఆస్ట్రేలియా టుడే నివేదించింది.
గురువారం తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో కాన్సులేట్ కార్యాలయం ముందు వైపు ద్వారం వద్ద ఓ గ్రాఫిటీని గుర్తించినట్లు విక్టోరియా పోలీసులు(Victoria Police) తెలిపారు.దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
దేశంలోని భారత దౌత్య, కాన్సులర్ ప్రాంగణాలు , సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు భారత హైకమీషన్ తన ట్వీట్లో పేర్కొంది.గురువారం జరిగిన సంఘటనలో ఎవరైనా అనుమానితులను గుర్తించారా? లేదా? అన్న దానిపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ ఘటనపై సమాచారం ఉన్న ఎవరైనా ముందుకు రావాలని అధికారులు కోరినట్లు పోలీస్ ప్రతినిధి వెల్లడించారు.ఈ చర్య భారతీయ ఆస్ట్రేలియన్ సమాజంలో ఆందోళనలను రేకెత్తించిందని, మెల్బోర్న్ అంతటా హిందూ దేవాలయాలు, భారత ప్రభుత్వ సంస్థలపై(Hindu temples ,Indian government institutions) జరుగుతున్న టార్గెట్ ఘటనల పెరుగుదలపై భారతీయ కమ్యూనిటీ ఆందోళన వ్యక్తం చేసినట్లు ది ఆస్ట్రేలియా టుడే పేర్కొంది.

ఇది కేవలం రాతలు కాదని, భారతీయ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని బెదిరింపు సందేశమని ఓ భారత సంతతి వ్యక్తి వ్యాఖ్యానించారు.మతపరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలపై పదే పదే దాడులు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశాడు.మరోవైపు.ద్వేషం, మతపరమైన పక్షపాతంతో ప్రేరేపించబడిన చర్యలకు శిక్షలను బలోపేతం చేయడానికి విక్టోరియా ప్రీమియర్ జసింటా అల్లన్ ప్రభుత్వం ఈ ఏడాది పలు కీలక చట్టాలను ఆమోదించిన సంగతి తెలిసిందే.