దక్షిణాదిలో పాగా వేయాలని కమలం పార్టీ నేతలు ఈసారి ఫిక్స్ అయిపోయారు.ముఖ్యంగా తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
అందుకే వారికి తెలంగాణ కాశ్మీర్ యాపిల్లా నిగనిగలాడుతూ కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలందరూ తెలంగాణలో పర్యటనల మీద పర్యటనలు చేసేస్తున్నారు.
ఇటీవల అమిత్ షా, ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించి అధికార పార్టీ టీఆర్ఎస్పై విమర్శల వర్షం కురిపించారు.
ఇప్పుడు మరోసారి బీజేపీ ప్రతిష్టాత్మక సమావేశాలను హైదరాబాద్లో నిర్వహించాలని ఆ పార్టీ నేతలు తలపెట్టారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు షెడ్యూల్ ఫిక్స్ అయింది.హైదరాబాద్ కేంద్రంగా జూలై 2,3 తేదీల్లో ఈ సమావేశాలు జరుగనున్నాయి.
హెచ్ఐసీసీ వేదికగా బీజేపీ కార్యవర్గ సమావేశాలను జరపాలని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నిర్ణయించారు.
బీజేపీ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు రెండు రోజుల పాటు హైదరాబాద్లో బస చేయనున్నారు.ప్రధాని మోదీ రాజ్ భవన్లో బస చేస్తారని.ఇతర కేంద్ర మంత్రులు, నేతలు ప్రముఖ హోటళ్లలో బస చేయనున్నట్లు షెడ్యూల్ ఫిక్స్ చేశారు.
మరో ఏడాదిన్నరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.
ఈసారి ఆరు నూరైనా గెలిచి తీరాలన్న పట్టుదల బీజేపీ కేంద్ర పెద్దలలో కనిపిస్తోంది.అందులో భాగంగానే బీజేపీ పెద్దలందరూ హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు కొన్ని ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ షాకిచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెడితే అధికారం చేపట్టడం కష్టం కాదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.హైదరాబాద్లో జరగనున్న ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు దేశంలో బీజేపీ దశా దిశను నిర్దేశించడంతో పాటు తెలంగాణలో అధికారం చేపట్టే దిశగా కార్యాచరణను రూపొందిస్తాయని తెలుస్తోంది.