ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అందులోనూ మే నెల కావడం వల్ల ఎండలు రోజు రోజుకు మండి పోతున్నాయి.
అందుకే ప్రజలు ఏసీ గదుల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు.అయితే వేసవిలో అధికంగా వేధించే సమస్యల్లో తలనొప్పి ఒకటి.
ముఖ్యంగా కొందరిని సమ్మర్లో తరచూ తల నొప్పి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.దాంతో ఏం చేయాలో తెలియక పెయిన్ కిల్లర్స్ వాడతారు.
కానీ, తరచూ పెయిన్ కిల్లర్స్ వాడటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.
అందుకే న్యాచురల్ పద్ధతుల్లోనే తల నొప్పిని నివారించుకోవాలి.
అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా సమ్మర్లో తలనొప్పి రావడానికి డీహైడ్రేషన్ ఒక కారణంగా చెప్పొచ్చు.
అందువల్ల, తరచూ నీటితో పాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లస్సీ వంటివి తీసుకుంటే హైడ్రేటడ్గా ఉంటారు.తల నొప్పి పరార్ అవుతుంది.
అలాగే తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మ రసం కలిపి తీసుకోవాలి.ఇలా చేస్తే తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.

ఒంట్లో వేడి ఎక్కువైనా తల నొప్పి వస్తుంటుంది.అందుకే సమ్మర్లో చలువ చేసే ఆహారాలను తీసుకోవాలి.ముఖ్యంగా సబ్జా వాటర్, పుచ్చకాయలు, కర్బుజా, కీర దోస, పుదీనా, మెంతులు వంటివి డైట్లో చేర్చుకుంటే తల నొప్పి రాకుండా ఉంటుంది.
సమ్మర్లో వేధించే తలనొప్పికి చెక్ పెట్టడంలో గంధం పొడి గ్రేట్గా సహాయపడుతుంది.
గంధం చెక్కను అరగ దీసి నుదుటిపై పూయాలి.ఇలా చేస్తే తల నొప్పి ఇట్టే పోతుంది.
ఎండలో తిరగడం వల్ల తలనొప్పి వస్తే.చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత కాసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటే.తల నొప్పి దూరం అవుతుంది.
మద్యం అలవాటు ఉన్న వారికి సమ్మర్ లో తలనొప్పి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి, మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.