సూర్యాపేట జిల్లా:బీసీల పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తుందని,దేశంలో 54 శాతం ఉన్న బీసీలకు 54 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత సత్యనారాయణ పిళ్లే డిమాండ్ చేశారు.బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్రప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ శనివారం స్థానిక మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మూతికి నల్లగుడ్డలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ జనాభాలో బీసీ కులగణన చేయాలని,బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ,ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకొని తిరుగుతున్న నరేంద్ర మోడీ బీసీల పట్ల నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.103 వ, రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు సమర్ధించడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమన్నారు.50% రిజర్వేషన్ ను డిమాండ్ చేస్తే సుప్రీంకోర్టు కొట్టి వేసిందని,కేంద్రంలో నాలుగు రోజుల్లోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి జనాభాలో 10% ఉన్న ఉన్నత వర్గాలకు 10% రిజర్వేషన్ కల్పించడం ఏంటని ప్రశ్నించారు.కేంద్రం తన స్వార్థపూరిత రాజకీయాల కోసం జీఓ తెచ్చిందని మండిపడ్డారు.తమిళనాడు,చత్తీస్ ఘడ్ లో అమలయ్యే విధంగా రాష్ర్ట అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు వెంకట్,రంగయ్య,గాయత్రి, నరసయ్య,వెంకటమ్మ,నిర్మల తదితరులు పాల్గొన్నారు.