సూర్యాపేట జిల్లా:ఆఫీస్ కి వచ్చేటప్పుడు తన జేబుకు నాకు లంచం వద్దని ఐడీ కార్డును పెట్టుకొని వస్తున్న రెవిన్యూ అధికారిని చూసి అందరూ నవ్వుకుంటున్నా వవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అంటూ దర్జాగా ఆఫీస్ కు వస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ కార్యాలయాల్లో పైసా లేనిదే పనులు కావని,ఫైల్ కదలదని అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా రెవెన్యూ శాఖ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లే.సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ శాఖపై తీవ్రమైన ఆరోపణలు చేసి,ఓ వ్యవస్థనే రద్దు చేసిన విషయం విదితమే.
అంతేకాదు ఇటీవల ఏసీబీ ట్రాప్ లో పట్టుబట్టినవారిలో రెవెన్యూ ఉద్యోగులే అధికంగా ఉండటం కూడా చూస్తున్నాం.ఇప్పుడు ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా! సుర్యాపేట జిల్లా పాలకవీడు మండలం అదనపు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున చిలకరాజు నర్సయ్య నేను లంచం తీసుకోను అంటూ రాసి ఉన్న బ్యాడ్జీని జేబుకు ధరించి విధులకు హాజరయ్యారు.
ఈ వినూత్న సంఘటన బుధవారం సూర్యాపేట జిల్లా పాలకవీడు రెవెన్యూ కార్యాలయంలో అందరినీ ఆకట్టుకుంది.ఇదేంటని ప్రశ్నించిన మీడియాతో ఉద్యోగి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయని,తాను మాత్రం లంచం తీసుకోనని చెప్పేందుకు ఇలా ఐడీ కార్డు పెట్టుకున్నానని తెలిపారు.