యాదాద్రి జిల్లా:తెలంగాణ రాష్ట్రం వస్తే పేదల బ్రతుకుల్లో వెలుగులు వస్తాయని కలలుగన్న వారి జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయని,ఎనిమిదేళ్లు అయినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు బట్టుపల్లి అనురాధ విమర్శించారు.ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భువనగిరి మండల తహశీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు.
ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పేద ప్రజలను సమీకరించి ఇళ్లలోకి ప్రవేశిస్తామని అన్నారు.ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేటికీ పేద ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని,అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,అర్హులైన వృద్ధులకు పెన్షన్లు,దళితులకు మూడు ఎకరాల భూమి అనే మాట నేటికీ నీటి మూటగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అనేకమంది అర్హులు 2017 సంవత్సరంలో పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న నేటి వరకు ఇచ్చిన పాపాన పోలేదన్నారు.పేద ప్రజల సమస్యలపై చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి నిరంకుశ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి పాండు మాట్లాడుతూ భువనగిరి పట్టణ కేంద్రంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,వారి సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో ముందు ముందు పోరాటాలు ఉదృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కి అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ,జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, గంధమల్ల మాతయ్య,పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు బర్ల వెంకటేష్,వనం రాజు,పట్టణ కమిటీ సభ్యులు బందెల ఎల్లయ్య,వెళ్దాసు అంజయ్య,కల్లూరి నాగమణి,చింతల శివ,చింతల సత్యనారాయణ, వనం గిరి,గందమళ్ళ బాలమణి,అంబటి లలిత, దండు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.