దేశంలో రాజకీయాలు నానాటికీ దిగజారిపోతున్నాయి.ఒక పార్టీ మతం పేరుతో, మరో పార్టీ కులం పేరుతో రాజకీయాలు చేస్తూ బ్రిటీషర్లకు తామేమీ తీసిపోలేదనే విధంగా ప్రవర్తిస్తున్నాయి.
తాజాగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను ఆ పార్టీ తీసుకురావడం వివాదానికి దారితీసింది.
దేశంలో దళితులను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదన చేసినట్లు అర్ధమవుతున్నా ఇప్పటికే ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ల కారణంగా ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోందనే భావన ప్రతిఒక్కరిలోనూ ఉంది.మళ్లీ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అంటే దేశం ఎక్కడికి పోతుందో అన్న భావన కలగక మానదు.
అసలే ప్రస్తుత రాజకీయాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు రావడం లేదు.కాస్తో కూస్తో ప్రైవేట్ రంగంలోనే నియామకాలు ఉంటున్నాయి.
ప్రతిభ ఉన్నవారికి కాస్తో కూస్తో సమాన అవకాశాలు అక్కడే లభిస్తున్నాయి.
ఓ వైపు కుల రహిత సమాజం అంటూ కులాంతర వివాహాలు, అటు మతాంతర వివాహాలు జరుగుతున్న వేళ. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అనే నినాదం వింటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుల రాజకీయాలు పరాకాష్టకు చేరాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.పార్టీకి పుర్వ వైభవం తేవాలంటే అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవాలి కానీ ఇలా ఓ వర్గానికే లాభం చేకూర్చేలా ప్రతిపాదనలు చేయడం కాదనే విషయాన్ని కాంగ్రెస్ గ్రహించాలంటూ పలువురు సూచిస్తున్నారు.
అటు బీజేపీ కూడా త్వరలో మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పడం సరికాదని హితవు పలుకుతున్నాయి.
హిందువులను ఎంత సపోర్ట్ చేస్తే మాత్రం మైనారిటీల జోలికి వెళ్లి వాళ్ల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పడం సరికాదని కమలం పార్టీపై పలువురు మండిపడుతున్నారు.జాతీయ పార్టీలు మతం, కులం పేరుతో విభజించి పాలిస్తామంటే తాము ఒప్పుకునేది లేదని ప్రజలు హెచ్చరిస్తున్నారు.జాతీయ పార్టీలు ఇలాంటి ఆలోచనలు చేయడం కారణంగా మనుషులు విడిపోయి మళ్లీ మళ్లీ కొట్టుకోవడం జరగదని ఏంటి గ్యారంటీ అని ప్రశ్నిస్తున్నారు.