దేశం కోసం ధర్మం కోసం అంటూ బీజేపీ కొత్తగా ఎత్తుకున్న నినాదమే ఇప్పుడు ఆ పార్టీ పరువు తీస్తోంది.ఈ స్లోగన్ ఇప్పుడు వైరల్ గా మారింది.
దేశవ్యాప్తంగా బీజేపీ పై అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.మొదట్లో బిజెపి, నరేంద్ర మోడీ విధానాలను సమర్ధించిన పార్టీలు, వ్యక్తులు ఇప్పుడు వ్యతిరేకించడం, ఒక్కో మిత్రపక్షం దూరం అవ్వడం, వ్యవసాయ సంస్కరణ బిల్లుతో దేశవ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహం పెరగడం, ఢిల్లీ వీధుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు లక్షలాది ట్రాక్టర్లతో నిరసనలు చేయడం, దీనిపై ప్రపంచ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అభాసుపాలవ్వడం వంటివి ఎన్నో జరిగాయి.
వీటన్నిటితో దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.దీనికి కారణం కేంద్ర బిజెపి పెద్దలు అనుసరిస్తున్న వైఖరే కారణంగా కనిపిస్తోంది.
దేశం కోసం ధర్మం కోసం అంటూ ప్రధాని మోదీ ఎత్తుకున్ననినాదంతో సెటైర్లు పెరిగిపోతుండడం తో ఇప్పుడు బిజెపికి ఇబ్బందికరంగా మారింది.దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిన నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం, ఈ ధరల ప్రభావం మిగతా అన్నిటిపైనా స్పష్టంగా పడడంతో, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీంతో దేశం కోసం ధర్మం కోసం ఇవన్నీ చేయాల్సిందేనంటూ సోషల్ మీడియాలోనూ బిజెపికి వ్యతిరేకంగా సెటైర్ లు వస్తున్నాయి.అలాగే ప్రభుత్వ రంగా ఆస్తులను ప్రైవేటీకరణ చేయడం, అన్ని సంస్థలను నిర్వహించడానికి ప్రభుత్వం ఏమి వ్యాపార సంస్థ కాదని ప్రైవేటీకరణకు అందరూ మద్దతు ఇవ్వాలని, దశలవారీగా ప్రైవేటు పరం చేస్తాము అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు బిజెపికి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి.
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేసే విషయంలో ఎక్కడ మొహమాటం లేకుండా చెప్పేయడం, అలాగే వేల కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వారిని వెనకేసుకు వస్తూ, వారి రుణాలను మాఫీ చేయడం ఇలా ఎన్నో అంశాలు బీజేపీ పై వ్యతిరేకత పెంచుతున్నాయి.
బిజెపి అంటే ఇప్పుడు ప్రజా వ్యతిరేక పార్టీ అనే ముద్ర పడే విధంగా అడుగులు వేస్తోంది.
రైతులు, కార్మికులు అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం తో ఇంతగా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.ఇతర దేశాల కన్నా భారతీయులే పెట్రోల్ , డీజిల్ పై ఎక్కువగా ట్యాక్స్ చెల్లిస్తున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
జర్మనీలో 65 శాతం, ఇటలీలో 65 శాతం, జపాన్ లో 45 , అమెరికాలో 20 శాతం ఉండగా, భారత్ లో మాత్రం 260 శాతం పన్ను ఉండడం, ప్రతియేటా ఇది పెంచుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్లడం, ఈ పరిస్థితి తలెత్తింది.పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా అన్ని వ్యవస్థలపైన పడుతుంది.
ఆ ప్రభావంతో దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వాటిపై ఆధారపడిన కార్మికులు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి.అలాగే దేశ వ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోతున్నా తగిన చర్యలు తీసుకోకపోవడం వంటివి ఆగ్రహం కలిగిస్తోంది.
ఇక ఏపీ విషయానికి వస్తే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు మొగ్గు చూపడం, ఈ విషయంలో ఏపీ బీజేపీ నేతలు వ్యతిరేకించినా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించకపోవడం వంటివి ఏపీలో బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి.పెరిగిపోతున్న ఈ ధరలను అదుపు చేసే ఆలోచన దిశగా కేంద్రం అడుగులు వేయకపోవడంతో సోషల్ మీడియాలో బీజేపీపై విమర్శలు పెరిగిపోతున్నాయి.
వివిధ రకాలైన మీమ్స్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.
![Telugu Central, Congress, Diesel, India, Naredramodhi, Angry, Petrol, Prime, Viz Telugu Central, Congress, Diesel, India, Naredramodhi, Angry, Petrol, Prime, Viz](https://telugustop.com/wp-content/uploads/2021/03/modhi-prime-minister.jpg )
” ఫ్లాట్ ఫారం టికెట్ 50.రద్దీని తగ్గించేందుకే ” కాదు కాదు 1000 చేస్తే అసలు రద్దీయే ఉండదు !
” విదేశాల్లోని నల్లధనం తెస్తానన్నాడు తేలేదు.కానీ దేశంలో ఉన్న మూలధనాన్ని లేపేస్తున్నాడు ”
” ప్రధాని మోదీ ప్రతి భారతీయుని గుండెను తాకుతున్నారు – గులాం నబీ ఆజాద్గుండె నేమో గాని, ప్రతీ బండినీ, బండనూ (గ్యాస్) తాకాడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెంచి ”
ఇలా ఎన్నెన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒకపక్క పెరుగుతున్న ధరలు, మరోపక్క వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడంతో ఒకపక్క బీజేపీకి ఆందోళన పెరిగిపోతుంది.గతంలో పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఇప్పుడు బాగా తగ్గింది అనేది ఆ పార్టీ నాయకులూ ఒప్పుకుంటున్నారు.
అయితే కేంద్రంలో బిజెపి కి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ బలహీనం కావడం, ప్రాంతీయ పార్టీలు అన్ని ఏకతాటిపైకి రాకపోవడం వంటి కారణాలతో బిజెపి హవా కొనసాగుతోంది.కాకపోతే ఇప్పుడు పెరుగుతున్న ధరలతో బీజేపి ప్రజల సానుభూతిని కోల్పోతున్నట్లు గా కనిపిస్తోంది.
అది కాకుండా, దేశ రాజధాని ఢిల్లీలో ను బిజెపి పట్టు సంపాదించుకోలేకపోవడం, అక్కడ తాజాగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఉప ఎన్నికల ఫలితాలలో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు వార్డులో నాలుగు స్థానాలు దక్కించుకోగా ఒక స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.ఇక త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికలో బీజేపీని బాగా భయపెడుతున్నాయి.