ఇటీవల కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ రామకృష్ణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోలు బయటకు రావడంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే ఈ సెల్ఫీ వీడియోలు ఎలా బయటకు వచ్చాయి? అందుకు కారణం ఎవరు? రామకృష్ణ సెల్ ఎవరి దగ్గర ఉంది? అన్న సందేహాలు అందరిలో తలెత్తాయి.వీటన్నింటికి సంబంధించిన కీలక విషయాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు.
కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవటానికి ముందు రామకృష్ణ తన స్నేహితుడి సహకారం తీసుకున్నట్లు తెలుస్తోంది.‘సారీ బాస్ నన్ను క్షమించు.
నేను ఒక వీడియో చేశాను.అది నా కార్ డ్యాష్ బోర్డులో ఉంది.
నా కార్యక్రమాలన్నీ అయిపోయాక ఓసారి ఫోన్ ఓపెన్ చేసి ఆ వీడియోను అందరికీ షేర్ చెయ్యి.ఫోన్ పాస్ వర్డ్ 7474.
నా కారు తాళం బాత్రూం పైన ఉంది.ఈ విషయం నీకు మాత్రమే చెబుతున్నా అంటూ మిత్రుడికి వాయిస్ మెసేజ్ పంపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు.
తాము ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.అందుకు ఎవరెవరూ కారణమన్నది అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే రామకృష్ణ తన మిత్రుడు సహాయం తీసుకున్నాడు.
రామకృష్ణ మెసేజ్ ప్రకారం అతని స్నేహితుడు కారు డ్యాష్ బోర్డు ఓపెన్ చేసి వీడియోను అందరికీ పంపించాడు.దీంతో ఈ ఘటన పెను సంచలనంగా మారింది.
మొత్తంగా ఏడు పేజీల రిమాండ్ రిపోర్ట్ను పోలీసులు కోర్టుకు సమర్పించారు.
రామకృష్ణ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ లేఖ రాసినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు.తన చావుకు తన తల్లి, సోదరి, వనమా రాఘవ కారణమని రామకృష్ణ లేఖలో పేర్కొన్నాడు.ప్రస్తుతం పాల్వంచ ఏఎస్పీ ఆధ్వర్యంలో కేసు విచారణను జరుగుతోందని పోలీసులు తెలిపారు.
ఆత్మహత్యయత్నంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామకృష్ణ కుమార్తె సాయి సాహితి వాంగ్మూలాన్ని జడ్జి సమక్షంలో నమోదు చేసినట్లుగా న్యాయస్థానానికి పోలీసులు తెలిపారు.
రామకృష్ణ బావమరిది ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని.క్లూస్ టీం సహాయంతో ఘటనా స్థలంలో మరిన్ని ఆధారాలు సేకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.ఇలా ఈ కేసుకు సంబంధించిన పలు సందేహాలకు పుల్ స్టాప్ పెడుతూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడించారు.
మరోపక్క ప్రస్తుతం భద్రాచలం సబ్ జైల్లో ఉన్న వనమా రాఘవేంద్రరావును విచారణ కోసం జ్యూడిషియల్ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.