కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ భయాందోళనలు కలిగిస్తున్న ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. అలాంటి కీలక ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా ప్రస్తుత సమయంలో నిధులను ఆపేయడం చర్చనీయాంశం అవుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా దేశాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న సంస్థకు ఈ సమయంలో ఎక్కువగా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది.కాని అమెరికా మాత్రం ఈ సమయంలో నిధులు ఆపేయడం దారుణం అంటూ ప్రపంచ దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
తాజాగా ఈ విషయమై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ స్పందించారు. ప్రస్తుత సమయంలో డబ్ల్యూహెచ్ఓకు నిధులను ఆపేయడం ప్రమాదకర నిర్ణయం అంటూ ఆయన అభిప్రాయ పడ్డాడు.
కరోనా విస్తరించకుండా డబ్ల్యూహెచ్ఓ కృషి చాలా ఉందని అన్నారు. ఆ సంస్థ చేస్తున్న పనిని మరే సంస్థ చేయలేదని, ఈ సమయంలో ఆ సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేయవద్దంటూ ట్రంప్కు బిల్గేట్స్ విజ్ఞప్తి చేశారు.
చైనాకు అనుకూలంగా డబ్ల్యూహెచ్ఓ పని చేస్తుందనే ఆగ్రహంతోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.మరి ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్న విమర్శలతో అయినా ట్రంప్ వెనక్కు తగ్గుతాడో చూడాలి.