ప్రపంచంలో కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయింది అమెరికానే.వైరస్ తమను ఏం చేయలేదని, తర్వాత చూసుకోవచ్చులే అన్న ట్రంప్ ధీమా లక్షలాది మంది అమెరికన్ల ప్రాణాలను బలి తీసుకుంది.
సెకండ్ వేవ్లోనూ అక్కడ మరణ మృదంగం మోగిస్తోంది. వ్యాక్సిన్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన అగ్రరాజ్యం మరణాలను అదుపు చేసేందుకు ఫైజర్, మోడర్నా టీకాల అత్యవసర వినియోగానికి అనుమతించింది.
తాజాగా మోడెర్నా టీకాకు అనుమతి ఇవ్వొచ్చంటూ నిపుణుల కమిటీ ఎఫ్డీఏకు సిఫార్సు చేసింది. 18 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ సురక్షితమేనని కమిటీ తేల్చింది.
దీంతో అమెరికాలో ఫైజర్ టీకా తర్వాత అందుబాటులోకి రానున్న రెండో కరోనా టీకాగా మోడెర్నా వ్యాక్సిన్ రికార్డుకెక్కనుంది.
అయితే టెన్నెస్సీ నగరంలో ఫైజర్ టీకా తీసుకున్న నర్సు టిఫానీ డోసు వేయించుకున్న కొద్దిసేపటికే అస్వస్థతకు గురికావడంతో అమెరికన్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి జంకుతున్నారు.
దీంతో ప్రజల్లో వ్యాక్సిన్పై విశ్వాసాన్ని నింపేందుకు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.తన భార్య జిల్తో కలిసి వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు వచ్చారు.
బైడెన్ దంపతులు కోవిడ్ ఫస్ట్ డోస్ను బహిరంగంగా సోమవారం తీసుకుంటారని ఆయన ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి ప్రకటించారు.వ్యాక్సిన్ సురక్షితమైందని ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని పంపడం కోసమే బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు.

మరోవైపు కోవిడ్ టీకా తీసుకున్న తొలి ప్రపంచనేతగా అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నిలిచారు.పెన్స్ భార్య కరేన్ కూడా టెలివిజన్ లైవ్లో కోవిడ్ టీకా వేయించుకున్నారు.అలాగే ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్, ఆమె భర్త కూడా వచ్చే వారం టీకాను స్వీకరిస్తారు.
కాగా, కోవిడ్-19 వ్యాక్సిన్ను తీసుకునే వాలంటీర్లుగా ఉండేందుకు అమెరికా మాజీ అధ్యక్షులు సిద్ధమైన సంగతి తెలిసిందే.టీకా భద్రత, ప్రభావంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యు బుష్, బిల్ క్లింటన్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
అమెరికన్లలో నమ్మకాన్ని పెంచేందుకు ఇదొక శక్తివంతమైన సందేశంగా ఉంటుందని వీరు భావిస్తున్నారు.