తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.ఈ అంశంలో ఇటు ప్రభుత్వం, అటు ఆర్టీసీ కార్మికులు బెట్టు వీడటం లేదు.
హైకోర్టు కూడా సమ్మెపై జరుపుతున్న విచారణను సీరియస్గా కొనసాగిస్తోంది.అయితే మొదటి నుంచీ సమ్మెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.
ఇప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు.కోర్టుతోనూ సై అంటే సై అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
కోర్టు లేవనెత్తుతున్న ప్రతి అంశంపై అధికారులతో గంటల తరబడి సమీక్షలు నిర్వహిస్తూ ఎలా ముందుకు వెళ్లాలో ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు.ఇప్పటికే సమ్మె విషయంలో కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్న మొండి వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.5100 రూట్లను ప్రైవేటీకరించాలన్న కేబినెట్ నిర్ణయంపైనా స్టే విధించింది.

దీనిపై సోమవారం తదుపరి విచారణ జరిగే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఓవైపు సమ్మె కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు.సమస్యను మరింత తీవ్రం చేస్తాయని కోర్టు అభిప్రాయపడింది.
రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోర్టు విచారణ జరుపుతోంది.శుక్రవారం విచారణ సందర్భంగా వాడివేడిగా వాదనలు నడిచాయి.
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కోర్టు ముందు ఉంచాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ను ఆదేశించింది.అయితే ఈ విషయంలోనూ ప్రభుత్వం తన వాదనను గట్టిగా వినిపించడం విశేషం.
రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం విశిష్ట అధికార పత్రమని, దానిని కోర్టు పరిశీలనకు ఇవ్వలేమని ఏజీ చెప్పారు.రాజ్యాంగ ఉల్లంఘనలు ఉంటే తప్ప కోర్టులు జోక్యం చేసుకోవద్దనీ అన్నారు.
దీనిపై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు.కేబినెట్ నిర్ణయం రహస్యం పత్రం కాదని, కోర్టు అడిగితే ఏదైనా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రజల కోసమే కేబినెట్ నిర్ణయం తీసుకున్నపుడు దానిని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

ఇటు కోర్టు ఆదేశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.ప్రైవేట్ బస్సులకు పర్మిట్లు ఇవ్వాలని కేబినేటే నిర్ణయం తీసుకున్నదని, దీనిపై కోర్టు అభ్యంతరం చెప్పడం ఏంటని కేసీఆర్ ప్రశ్నించడం గమనార్హం.దీనిపై ఎదురయ్యే న్యాయపరమైన చిక్కుల ఏమిటని ఏజీని సీఎం అడిగి తెలుసుకున్నారు.
మొదటి నుంచీ సమ్మె విషయంలో కోర్టు జోక్యాన్ని ప్రశ్నిస్తున్న ఆయన.తాజా ఆదేశాలపై కూడా తనదైన రీతిలో స్పందించారు.ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూల్ ప్రకారమే ఏపీఎస్ ఆర్టీసీని విభజించుకున్నామని, ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీ అస్తిత్వంలోనే ఉందని ఈ సందర్భంగా అధికారులు కేసీఆర్కు వివరించారు.

టీఎస్ ఆర్టీసీ ఉనికిలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలియదని, విభజనకు కేంద్రం అనుమతి తీసుకోలేదని అసిస్టింట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్రావు కోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అసలు టీఎస్ ఆర్టీసీలో 5100 రూట్లను ప్రైవేటీకరించడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తింది.దీంతో ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు అధికారులు సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
రెండు రాష్ట్రాలు విడిపోగానే కేంద్ర చట్టాలను అన్వయించుకోవాలని కేంద్ర ప్రభుత్వమే చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్కు అధికారులు గుర్తు చేశారు.కొన్ని ఆస్తుల పంపకం విషయంలోనే ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య చర్చలు నడుస్తున్నాయని వివరించారు.
వీటిపై స్పందించిన కేసీఆర్.సోమవారం కోర్టులో తమ వాదనలను బలంగా వినిపించాలని అధికారులను ఆదేశించారు.
ఆర్టీసీ విభజన, ఆస్తులు, ఉద్యోగుల పంపకంలాంటి సమాచారం మొత్తాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని తేల్చి చెప్పారు.