ప్రజలకు ఆహారం ప్రధానం.తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వాల బాధ్యత.
తక్కువ ధరలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించడం సర్కారు విధి.కాని మన ప్రభుత్వాలు ఈ పనులు చేయడంలేదు.
దేశంలో ఆహార పదార్థాల ధరలు, ఉప్పు పప్పుల ధరలు, కూరగాయల రేట్లు ఎలా పెరిగిపోతున్నాయో మనం చూస్తున్నాం.అధికారంలో ఉండే పార్టీ ప్రజలకు తక్కవ ధరలో (ప్రధానంగా పేదలకు) ఆహారం, సరుకులు అందిస్తే దాన్ని ప్రజలు ఆదరిస్తారు.
అందుకే ఏ రాష్ర్టంలోనైనాసరే అధికారంలోకి వచ్చిన పార్టీ ముందుగా ధరలు తగ్గించేందుకు, తక్కువ ధరల్లో నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.ఎన్టీ రామారావు అధికారంలోకి రాగానే దీనిపైనే దృష్టి పెట్టి రేషన్ షాపుల ద్వారా కిలో రెండు రూపాయలకే బియ్యం అందించారు.
తమిళనాడులో రూపాయికే ఇచ్చారు.ఇలాంటి పథకం అనేక రాష్ర్టాల్లో ఉంది.
తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రాగానే హైదరాబాదులో పేదల కోసం ఐదు రూపాయలకే భోజనం అనే పథకం ప్రారంభించారు.ఏపీలో చంద్రబాబు అన్న క్యాంటీన్ల పేరుతో ఈ పథకం ప్రారంభిస్తామన్నారు.
ప్రస్తుతం ఇలాంటి పథకమే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించబోతున్నారు.ఐదు నుంచి పది రూపాయల లోపు ఖర్చు చేస్తే మంచి పోషకాహారం లభిస్తుంది.
ప్రభుత్వ సబ్సిడీ ద్వారా ఈ పథకం అమలు చేస్తారు.చిన్నాచితక ఉద్యోగాలు చేసుకునే పేదలు, అల్పాదాయ వర్గాలవారి కోసం ఈ పథకం అమలు చేయబోతున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు.
రెండు నెలల్లో ఇది అమల్లోకి వస్తుంది.అయితే ఇలాంటి ఆహార పథకాలు ఘనంగా ప్రారంభిస్తారుగాని తరువాత పట్టించుకోరు.
ఢిల్లీ సీఎం అలా జరగకుండా చూడాలి.