అసలు ఈటెల రాజేందర్ బీజేపీలో చేరతారా లేక సొంత పార్టీ పెడతారా అనే విషయంపై పూర్తి స్థాయిలో స్పష్టత లేదు.ఆయన బిజెపిలో చేరిక దాదాపు ఖాయమయిందని విస్తృతంగా ప్రచారం అవుతోంది.
మరోవైపు రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు అనే చర్చా జరుగుతోంది.ఈ విషయాలు ఇలా ఉంటే, ఇప్పుడు రాజేందర్ బిజెపి లో చేరిక విషయమై ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
రాజేందర్ రాకను కొంతమంది హుజురాబాద్ కీలక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.మొన్నటివరకు రాజేందర్ అవినీతి వ్యవహారాలపై తాము పోరాటాలు చేసామని చెప్పి ఇప్పుడు అదే వ్యక్తిని బీజేపీలోకి ఆహ్వానిస్తే ఎలా అంటూ తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు పెద్దిరెడ్డి బహిరంగంగానే ఈటెల రాజేందర్ రాకపై ఆగ్రహంగా ఉన్నారు.అసలు ఆయన బిజెపిలో చేరబోతున్నారు అనే విషయాన్ని పార్టీ నేతలెవరూ తమకు సమాచారం ఇవ్వలేదని , హుజురాబాద్ నుంచి గతంలో తాను ప్రాతినిధ్యం వహించానని, రెండుసార్లు మంత్రిగా పని చేశానని అటువంటి తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే బిజెపి జాతీయ నేతలు సైతం రాజేందర్ తో చర్చలు జరిపారని, హుజురాబాద్ బిజెపి నాయకులు ఎవరికి ఈ విషయంపై ఎటువంటి సమాచారం పార్టీ నుంచి రాలేదని పెద్దిరెడ్డి చెబుతున్నారు.
ఒకవేళ రాజేందర్ ను బిజెపి లోకి తీసుకువచ్చి హుజురాబాద్ నుంచి పోటీ చేయిస్తే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజేందర్ చేరిక విషయంలో బిజెపి జాతీయ నేతలు బండి సంజయ్ వంటి వారిని సంప్రదించారని, కనీసం ఆ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న తమను ఎందుకు పట్టించుకోలేదని పెద్దిరెడ్డి ఆగ్రహంగా ఉన్నారు.

బిజెపి అంటే విలువలు కలిగిన పార్టీ అని, అటువంటి పార్టీలోకి భూకబ్జా ఆరోపణలు ఉన్న వ్యక్తి ని ఏవిధంగా తీసుకొస్తున్నారు అంటూ పార్టీ నిర్ణయాన్ని పెద్దిరెడ్డి తప్పు పడుతున్నారు.ఇదిలా ఉంటే రాజేందర్ బిజెపిలో చేరిన వెంటనే పెద్దిరెడ్డి బిజెపికి రాజీనామా చేసి, టీఆర్ఎస్ లో చేరుతారని, రాజేందర్ పై టీఆర్ఎస్ అభ్యర్థిగా పెద్దిరెడ్డి పోటీ చేస్తారు అంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.ఈ మేరకు టిఆర్ఎస్ అగ్రనేతలతో పెద్దిరెడ్డి చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ విషయాన్ని పెద్దిరెడ్డి మాత్రం ధృవీకరించడం లేదు.తాను ఎవరితోనూ పార్టీ మార్పు విషయమే చర్చించలేదని ఆయన చెప్పుకొస్తున్నారు.ఏది ఏమైనా రాజేందర్ విషయంలో బీజేపీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది.