తన కేబినెట్లో భారతీయులకు మంచి పదవులు కట్టబెడుతూ వస్తోన్న బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తాజాగా మరో భారత సంతతి మహిళ సుయెల్లా బ్రావర్మన్ను యూకే అటార్నీగా నియమించారు.సోమవారం లండన్లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్లో జరిగిన కార్యక్రమంలో సుయెల్లా అటార్నీ జనరల్గా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రిటన్ న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్దరించడమే తన ప్రాధాన్యత అన్నారు.అటార్నీ జనరల్గా ప్రమాణ స్వీకారం చేయడం ఒక విశేషమని, ఎంతో చరిత్ర ఉన్న ఈ పదవిని చేపట్టిన రెండో మహిళగా తనకు గర్వంగా ఉందన్నారు.
గత అటార్నీ జనరల్ జెఫ్రీ కాక్స్పైనే సుయెల్లా ప్రశంసలు కురిపించారు.
విధి నిర్వహణలో భాగంగా ఆమె న్యాయాధికారుల విభాగాలను పర్యవేక్షిస్తారు.
ఇందులో స్వతంత్ర ప్రాసిక్యూటింగ్ అధికారులు, క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్, సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్ ఉన్నాయి.కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్ధిగా ఆగ్నేయ ఇంగ్లాండ్లోని ఫేర్ హామ్కు 2015 నుంచి సుయెల్లా ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఈమె బ్రిగ్జిట్ వాదనకు తొలి నుంచి మద్ధతుగా నిలిచారు.యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి ముందు పూర్వపు విభాగంలో సుయెల్లా మంత్రిగా పనిచేశారు.
అటార్నీ జనరల్ ట్రెజరీ కౌన్సిల్ మాజీ సభ్యురాలిగా ఆమె గతంలో ఇమ్మిగ్రేషన్ కేసులలో హోమ్ మంత్రిత్వ శాఖకు అనుకూలంగా మాట్లాడారు.

బ్రావర్మన్ పూర్తి పేరు సుయెల్లా ఫెర్నాండెజ్ లండన్లో కెన్యా మరియు మారిషస్ నుంచి వలస వచ్చిన తల్లిదండ్రులకు జన్మించారు.వీరిద్దరి మూలాలు గోవా, దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి.39 ఏళ్ల సుయెల్లా ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని క్వీన్స్ కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టా, పారిస్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.