టీఎస్ ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు వినూత్న నిర్ణయాలు అమలు చేస్తున్నారు.వివిధ దినోత్సవాలకు ప్రజలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తూ ఆర్టీసీ సేవలను ప్రజలందరికీ చేరువ చేస్తున్నారు.
ఖాళీగా ఉన్న సంస్థ స్థలాలను అద్దెకిచ్చి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నారు.ఈ క్రమంలో తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సంస్థకు ఆదాయం సమకూరేలా వాటర్ బాటిళ్లను టీఎస్ఆర్టీసీ తయారు చేయనుంది.
తాము తయారు చేసే వాటర్ బాటిళ్లకు డిజైన్, పేరు సూచించాలని ప్రజలను టీఎస్ఆర్టీసీ కోరుతోంది.
ఫలితంగా వచ్చిన అన్నింటిలోనూ బెస్ట్ సెలెక్ట్ చేసి, విజేతలకు రివార్డు అందించనుంది.దీనిని స్వయంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.ప్రయాణీకుల కోసం 500 ఎంఎల్, ఒక లీటర్ వాటర్ బాటిళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు.బాటిళ్లకు మంచి టైటిల్ పెట్టాలని, ఆకర్షణీయమైన డిజైన్ తెలియజేయాలని కోరారు.
ప్రజల నుంచి వచ్చిన వాటిలో అత్యుత్తమమైన దానిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.వాటికి తగిన బహుమతిని ఇస్తామని తెలియజేశారు.9440970000 నంబరుకు వాట్సాప్ చేయాలన్నారు.
ఆర్టీసీ తాజా సూచనతో ప్రజల నుంచి తగిన స్పందన వస్తోంది.
ఈ కాంటెస్ట్లో పాల్గొనేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు.ఇప్పటికే చాలా మంది వివిధ పేర్లను సూచించడంతో పాటు, బాటిళ్ల నమూనాలను పంపినట్లు తెలుస్తోంది.
తాజా ప్రకటనతో ఆర్టీసీ నుంచి ప్రత్యేక వాటర్ బాటిళ్లు ఉన్నట్లు ప్రజల్లో ప్రచారం బాగా సాగుతోంది.ఫలితంగా బస్టాండ్ల నుంచి కనీసం ఒక గంట కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారు బస్టాండ్లలోని వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తుంటారు.
ఇక ప్రతి బస్టాండ్లోనూ స్టాళ్లలో వీటిని పెట్టే అవకాశం ఉంది.వాటి ద్వారా కూడా తగిన ఆదాయం ఆర్టీసీకీ సమకూరనుంది.
దీనిపై నిర్ణయం తీసుకున్న ఎండీ సజ్జనార్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.