ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలపై కరోనా కల్లోలం రేపుతోంది.ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు అన్ని దేశాలు లాక్డౌన్ వంటి ఆంక్షలు పాటిస్తున్నాయి.
శరవేగంగా విస్తరిస్తున్న కేసులు, రికార్డు స్థాయి మరణాలతో అగ్రరాజ్యం అతలాకుతలం అయిపోతోంది.ఇప్పటికే ఆర్ధిక మాంద్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికాకు కరోనా శరాఘాతంలా తగిలింది.
దేశ ఆర్ధిక వ్యవస్థ భయంకరమైన వేగంతో పడిపోతోందని సాక్షాత్తూ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ హెచ్ పావెల్ చెప్పారంటే పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అందువల్లే ట్రంప్ సైతం తొలుత లాక్డౌన్ అమలు చేసేందుకు ససేమిరా అన్నారు.
ఆర్ధిక మందగనం, లాక్డౌన్ కష్టాల నేపథ్యంలోనే చిన్న వ్యాపారాలు, పెద్ద కంపెనీలకు 2 ట్రిలియన్ డాలర్లకు పైగా సహాయం అందించడానికి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజ్ను ప్రకటించింది. కాగా ఇప్పటి వరకు అమెరికాలో 17 మిలియన్లకు పైగా ప్రజలు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగారు. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో వివిధ బృందాలను ఏర్పాటు చేశారు.ఈ బృందాలలో ఆరుగురు భారతీయ ప్రముఖులు స్థానం దక్కించుకున్నారు. వీరిలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ, మైక్రాన్ సీఈవో సంజయ్, పెర్నాడ్ రికార్డ్ బివరేజ్ సీఈవో ఆన్ ముఖర్జీ, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా ఉన్నారు.
వీరంతా ఇన్ఫర్మేషన్, టెక్నికల్ తదితర రంగాల్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎలా అధిగమించాలో ట్రంప్కు సూచనలు అందిస్తారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయ, బ్యాంకింగ్, నిర్మాణ, కార్మిక, రక్షణ, ఇంధన, ఆర్ధిక సేవలు, ఆరోగ్యం, పర్యాటక, తయారీ, స్థిరాస్తి, రిటైల్, టెక్నికల్, కనస్ట్రక్షన్, ట్రాన్స్పోర్ట్, స్పోర్ట్స్ తదితర నిపుణులకు ట్రంప్ ఈ బృందాల్లో చోటు కల్పించారు.