తెలంగాణ రాష్ట్రం రోజు రోజుకు అప్పుల ఊబిలో కూరుకుపోతోంది.అంచనాలకు మించి అప్పులు చేయడంతో ఆ భారమంతా ప్రజలపై పడుతోంది.
ఏఫ్ఆర్ఎమ్ చట్ట పరిమితులకు లోబడి ప్రభుత్వం ఏటా తెస్తున్న అప్పులు ఒక ఏడాది బడ్జెట్ ను మించిపోయాయి అంటే ఎంతగా అప్పులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.ఇక సంక్షేమ సంక్షేమ పథకాలను అమలు పరిచేందుకు నిధులు లేక అప్పుల పైనే ఆధార పడాల్సి వస్తోంది.
దీంతో ఆర్బీఐ ద్వారా ఓపెన్ మార్కెట్ రుణాలకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది.ఏప్రిల్ 11 నుంచి ఈ నెల 2 వరకు ఓపెన్ మార్కెట్ రుణాల కింద రూ.6 వేల కోట్ల రుణాలు సేకరించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది.అయితే ఇందుకు కేంద్రం అనుమతి నిరాకరించింది.
నిజానికి రాజ్యాంగంలోని 293 ఆర్టికల్ కింద మార్కెట్ రుణాల కోసం రాష్ట్రాలు కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాలి.అయితే ఇప్పటివరకూ కేంద్రం సాధారణంగానే అనుమతులిచ్చేది.
కానీ, ఇటీవలి కాలంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి కేంద్రం ఆరా తీయడం ప్రారంభించింది.బడ్జెట్లో ప్రతిపాదించని ఖర్చుల కోసం చేసిన రుణాలు, కార్పొరేషన్లకు ఇచ్చే గ్యారంటీలపై తగిన సమాధానాలు ఇచ్చిన తర్వాతే అనుమతులివ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తాజాగా కాగ్ కూడా బడ్జెట్ ప్రతిపాదనలతో సంబంధంలేని ఖర్చుల కోసం అప్పులు చేయడంపై తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.ఈ రుణాలను ఆమోదిస్తే.కేంద్రం అనుమతించిన దాని కంటే ఎక్కువ అప్పులు చేసినట్లవుతుందని కాగ్ అభిప్రాయపడింది.బడ్జెట్తో సంబంధంలేని రుణాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వలేదని, తద్వారా ఎఫ్ఆర్బీఎం నిబంధనల్ని అతిక్రమిస్తోందని తన నివేదికలో తెలిపింది.
దీనివల్ల శాసనసభకు జవాబుదారీ కాకుండా అప్పులు చేయడం జరుగుతోందని, ఇది ఆర్థిక నిర్వహణలో అవకతవకలకు దారి తీస్తోందని తెలిపింది.
అయితే గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రుణాలు అంతకుముందు ఏడాది కంటే 19 శాతం పెరిగిపోయాయని కాగ్ తెలిపింది.జీఎస్డీపీ, రెవెన్యూ వసూళ్ల కంటే అప్పుల శాతం పెరుగుతోందని పేర్కొంది.తక్కువ వడ్డీ రేట్లతో దీర్ఘకాలిక రుణాలను తీసుకోవడం ద్వారా పడే ఆర్థిక ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం చేయలేదని, వివిధ సంస్థలకు ఇచ్చిన గ్యారంటీల గురించి కూడా పూర్తి సమాచారం ఇవ్వడం లేదని వెల్లడించింది.
రెవెన్యూ, ద్రవ్యలోటును భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ రుణాలు చేస్తోందని, దీనికి మించి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల కింద పొందిన మొత్తం కూడా పెరిగిపోతోందని తెలిపింది.