నల్లగొండ జిల్లా:ప్రేమించానని వెంటపడ్డాడు,నువ్వులేక నేను లేను అని సినిమా డైలాగులతో మాయమాటలు చెప్పి నమ్మబలికాడు.పెళ్లి చేసుకుంటానని మాటలు చెప్పి అమాయక మైనర్ బాలికకు దగ్గరయ్యాడు.
అవసరం తీరాక వదిలించుకోవాలని కుట్రపన్నాడు.ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని బాలిక ఇంట్లోకి దూరి,మన పెళ్లి పెద్దలు ఒప్పుకోవడం లేదని,అందుకే నేను ఆత్మహత్య చేసుకోవాలని పురుగుల మందు తాగానని,ఇద్దరం చనిపోదాం నువ్వు కూడా తాగమని నమ్మించి మైనర్ బాలికకు పురుగుల మందు తాపించి అక్కడి నుండి పారిపోయిన మోసగాడి ఉదంతం నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే… బాలిక బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి సాగర్ మండలం నాగార్జునపేట తండాకు చెందిన అంగోత్ పాపా,కమిలిల దంపతుల కూతురు అంగోత్ ఇందు(అమ్ములు)(14)ను గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన బాణవత్ విన్నూ (20) అనే యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడి నమ్మబలికి చివరికి బలవంతంగా పురుగుల మందు తాపించి పారిపోయాడు.పురుగులమందు త్రాగిన విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటాహుటిన కమలా నెహ్రూ దవాఖానకు తరలించారు.
చికిత్స పొందుతూ బాలిక మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.గతంలోనూ బాణవత్ విన్నూ ఇదే తరహాలో మరో అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు నటించి మోసం చేసి అమ్మాయి చనిపోవడానికి కారణమయ్యాడని తెలిపారు.
అదే విధంగా తమ కూతురు మరణానికి కారకులైనవాడిని తమ కుతురు లాగా ఎవ్వరిని ఇకపై మోసం చేయకుండా కఠినంగా శిక్షించాలని,అదేవిధంగా తమకు న్యాయం చేయాలని స్థానిక పోలీసుస్టేషన్ లో పిర్యాదు చేసినట్లు చెప్పారు.స్థానిక గిరిజన నాయకులు బాధిత కుటుంబానికి సానుభూతిని తెలియచేస్తూ కారకులైన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.