టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ పై అలక చెందిన టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం ఆ పార్టీ లో ఇంకా పొగలు సెగలు రేపుతూనే ఉంది.పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని, తాను ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీలో వ్యవహరించినా, ప్రస్తుతం తనను పట్టించుకోనట్టు వ్యవహరిస్తూ, అధినేత చంద్రబాబు, లోకేష్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటూ ఎన్నో ఆరోపణలు చేస్తూ, పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.
అయితే బుచ్చయ్య వ్యవహారం ఆకస్మాత్తుగా చోటుచేసుకోవడంతో, టిడిపి కూడా ఆత్మరక్షణలో పడింది.పార్టీకి సంబంధించిన కీలక నేతలతో ఓ కమిటీని నియమించి ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించినా, బుచ్చయ్య మాత్రం ససేమిరా అంటూ ఉండటంతో, ఆయనను ఏ విధంగా తమ దారిలోకి తెచ్చుకోవాలనేది అర్థం కాని పరిస్థితి.
ఇదిలా ఉంటే బుచ్చయ్య వ్యవహారం పై మాత్రం తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.అసలు టిడిపి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, అది పార్టీకి మేలు చేసే విధంగా తగిన సలహాలు, సూచనలు ఇస్తూ, అందరికీ ధైర్యం చెబుతూ, వైసీపీ ప్రభుత్వం పై పోరాడాలని , పార్టీ ఇప్పటికే ఆయనకు తొమ్మిది సార్లు టికెట్ ఇచ్చిందని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అని , అయినా ఈ సమయంలో తనను పట్టించుకోవడం లేదంటూ బుచ్చయ్య ఫైర్ అవుతున్న విధానం పై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.
ఎన్టీఆర్ హయాంలో దక్కిన గౌరవమర్యాదలు ఇప్పుడు అదే విధంగా దక్కాలి అనుకుంటే అది ఎలా సాధ్యమవుతుందని, సీనియర్ నాయకులు ఇంకా యాక్టివ్ గా ఉండాలనుకుంటూ, ఇంకా ప్రాధాన్యత కోరుకుంటూ ఉంటే పార్టీలో యువ నాయకత్వం ఎప్పుడు వస్తుందని, యువకులకు పెద్ద పీట వేసే విధంగా బుచ్చయ్య వంటి సీనియర్లు అవకాశం ఇవ్వాల్సి పోగా, పార్టీని ఇబ్బంది పెట్టడం సరికాదంటూ మండిపడుతున్నారు.కేవలం బుచ్చయ్య మాత్రమే కాకుండా, యనమల రామకృష్ణుడు వంటి వారు దాదాపు పది, పదిహేను మంది సీనియర్ నాయకులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి, యువ నాయకులకు ప్రోత్సాహం అందించాలని, అప్పుడే టిడిపికి మళ్ళీ పునర్వైభవం వస్తుంది అంటూ సూచిస్తున్నారు.