జగన్కు గత ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ ఓటర్లు పెద్ద షాకే ఇచ్చారు.నగరంలోని నాలుగు దిక్కులా ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులను ఓడించారు.
ఆ తర్వాత జగన్ విశాఖపై వైసీపీ జెండా ఎగుర వేయాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.విశాఖను ఏకంగా పరిపాలనా రాజధానిగా ప్రకటించారు.
దీనికి తోడు టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలతో పాటు గత ఎన్నికల్లో ఓడిన వారు… చివరకు టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను సైతం వైసీపీలోకి తీసేసుకుంటున్నారు.దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సైతం ఇప్పటికే టీడీపీని వీడి వైసీపీ ఫ్యాన్ కిందకు చేరిపోయారు.
జగన్ సూచనల మేరకు విజయసాయి రెడ్డి విశాఖను బాగా టార్గెట్గా చేసుకున్నట్టే కనిపిస్తోంది.ఈ క్రమంలోనే గతేడాది నిర్వహించాలనుకున్న జీవీఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ గెలవాలని ప్లాన్ చేశారు.
జీవీఎంసీలో ఉన్న 98 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించి… బీ ఫారాలు ఇస్తారనుకుంటున్నన టైంలోనే నాడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను ఆకస్మాత్తుగా వాయిదా వేశారు.అప్పటి నుంచి 9 నెలలుగా ఎన్నికలు జరగలేదు.
అయితే వైసీపీ కార్పోరేటర్ అభ్యర్థులుగా ఎంపికైన వారు మాత్రం తామే కార్పొరేటర్లు ఫీల్ అవుతూ దందాలు చేస్తూ అందిన కాడకు దోచుకుంటున్నారట.
దీంతో ప్రజల్లో వీరిపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది.ఇక కొందరు పార్టీ నేతలు ప్రభుత్వ పథకాల సాకుతో చేతి వాటం ప్రదర్శిస్తుండడంతో సామాన్య ప్రజల్లో వీరిపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోన్న మాట నిజం.దీంతో జనంలో పార్టీకి కావాల్సినంత చెడ్డ పేరు వస్తోంది.
దీనికి తోడు నగరంలో చాలా గ్రూపులు మొదలయ్యాయి.పార్టీ నేతల్లో చాలా మందికి ఒకరికి ఒకరంటే పడడం లేదు.
ఇక రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి దూకుడు నచ్చని వాళ్లు కూడా గుస్సాతో ఉన్నారు.ఈ పరిణామాలు చూస్తుంటే విశాఖ మేయర్ పీఠం కొట్టాలని కసితో ఉన్న వైసీపీకి ఇవి డేంజర్ బెల్స్గా మారుతున్నాయి.