తెలంగాణలో అధికారం సంపాదించడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్న బిజెపి ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.కేవలం టిఆర్ఎస్ తప్పిదాలను మాత్రమే హైలెట్ చేసుకుంటూ ముందుకు వెళితే అధికారం దిశగా అడుగులు వేయడం కష్టమని అభిప్రాయపడుతున్న బిజెపి ఇప్పుడు కాంగ్రెస్, టిఆర్ఎస్ , టిడిపి లలో ఉన్న అసంతృప్తి నాయకులను గుర్తించి, వారిని తమ పార్టీలో చేర్చుకునే వ్యూహం పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది.
గతంలో ఎలా ఉన్నా, ప్రస్తుత పరిస్థితులు కారణంగా బిజెపికి తెలంగాణలో మంచి పట్టే దొరికింది.దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు, గ్రేటర్ లోనూ సత్తా చాటుకోవడం తో , మిగతా పార్టీల్లోని నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకోవడం ద్వారా బలం పెంచుకోవాలని బిజెపి చూస్తోంది.
మొన్నటి వరకు బిజెపిలోకి వెళదామా వద్దా అంటూ ఆలోచిస్తూ వచ్చిన ఇతర పార్టీల్లోని నాయకులకు ఇప్పుడు బిజెపి అధికారంలోకి రాగలదు, టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ నే అనే అభిప్రాయం ఏర్పడడంతో, పెద్ద ఎత్తున నాయకులు బిజెపి బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో బలమైన నాయకులుగా ఉన్న విజయశాంతి బిజెపిలో చేరి పోయారు.అంతకుముందే మాజీ మంత్రులు చాలామంది బిజెపి బాట పట్టారు.ప్రస్తుత పరిస్థితుల్లో టిఆర్ఎస్ లో ఉన్న కీలక నాయకులు చాలామంది, చాలా కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
అటువంటి నాయకులంతా రాజకీయ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు.ఇప్పుడు అటువంటి నాయకులను బిజెపిి టార్గెట్ చేసుకుని, తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
కొంతమంది బలమైన నాయకులకు వివిధ ఆఫర్లు ఇస్తూ, పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఈ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమానికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు.
మండల స్థాయి నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా బిజెపి బాట పట్టించేందుకు బండి సంజయ్ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.కాంగ్రెస్, టిఆర్ఎస్ టిడిపి ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా, అందర్నీ బిజెపి బాట పట్టించేందుకు చూస్తున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఎంపిక పూర్తయితే పెద్ద ఎత్తున అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశం ఉందని, కీలక నాయకులు బీజేపీ బాట పడతారని సంజయ్ అభిప్రాయపడుతున్నారు.ఢిల్లీకి వెళ్లిన బండి సంజయ్ చేరికల విషయమై అధిష్టానం పెద్దలతో చర్చించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఏ పార్టీ నుంచి ఎంత మంది నాయకులు చేరబోతున్నారు అనే విషయంతోపాటు, ఎవరెవరు పార్టీలో చేరే అవకాశం ఉంది అనే విషయాలపైన చర్చించినట్లు సమాచారం.