ఏడేండ్లుగా సీఎం కేసీఆర్ రైతుల్ని మోసం చేస్తున్నారంటూ బండి సంజయ్ మండిపడ్డారు.వరి ధాన్యం కొనమంటే కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని అన్నారు.
దళిత బంధు పేరుతో దళితులను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు.ఎంత మందికి దళిత బంధు ఇచ్చారో చెప్పాలన్నారు.
దళితులకు మూడేకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు.కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల కోసమే నిర్మించారని ఆరోపించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది.
మూడు ఎకరాల భూమి, దళిత బంధు ఇస్తామంటూ ఎస్సీలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో చిన్న రోడ్లకు కూడా ప్రభుత్వం మరమ్మతులు చేయలేకపోతోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే సీఎం కేసీఆర్ ఆ నిధులను వాడుతూ తన పథకాలుగా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ హామీలు ఇచ్చిన కేసీఆర్ అన్నింటినీ మర్చిపోయారని, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు కట్టబెట్టారని ఆరోపించారు.అలాగే, ఆరు నెలల్లో ఆర్డీఎస్ పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, అయినప్పటికీ ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
అంతకుముందు మంత్రి మల్లారెడ్డి బండి సంజయ్పై విమర్శలు గుప్పించారు.బండి సంజయ్ ఖబర్దార్.సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై అవాకులు చెవాకులు పేలితే తెలంగాణ ప్రజలు సహించరు’ అని మల్లారెడ్డి హెచ్చరించారు.మేడ్చల్లో మీడియాతో మాట్లాడుతూ.బండి సంజయ్ ఓ మెంటల్ అని, బీజేపీ దగా కోరు పార్టీ.కాంగ్రెస్ దివాళా తీసిన పార్టీ అని వ్యాఖ్యానించారు.
బండి పాదయాత్ర ఎందుకో అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు.సాగు, తాగు నీరు, 24 గంటల కరెంట్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే కేసీఆర్ నంబర్ వన్ సీఎంగా నిలిచారని కొనియాడారు.
ఆయనను దూషిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని, బీజేపీ నాయకులను తరిమి కొడతారన్నారు.బీజేపీ సింగిల్ డిజిట్ గాళ్లు ఏమీ చేయలేరని విమర్శించారు.
8 ఏండ్లుగా కేంద్రంలో, పలు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, చేసిందేమీ లేదని.ఇంటింటికి నీళ్లు ఇచ్చిండ్రా? 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రు.అని మంత్రి ప్రశ్నించారు.రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే పాదయాత్రలు చేస్తూ అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.