ఏపీలో ప్రతిసారి ఏదో ఒక విషయంలో రాజకీయం సాగుతున్న విషయం తెలిసిందే.మొన్నటి దాకా టికెట్ల రేట్లు, ఆ తర్వాత ఉద్యోగుల సమస్యలు ఇలా ఏదో ఒక విషయం మీద రగడ సాగుతూనే ఉంటుంది.
ఇక పోతే ఇప్పుడు కొత్త జిల్లాలు చేసిన తర్వాత పేర్ల మీద లొల్లి సాగుతోంది.కొత్త జిల్లాలకు వారి పేర్లు పెట్టలేదు, వీరి పేర్లు పెట్టలేదని ఇప్పటికే పెద్ద రచ్చ సాగుతోంది.
ఇక రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ పేరు పెట్టలేదని చాలా విమర్శలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో టీడీపీ కూడా ఇదే విషయం మీద పట్టు బడుతోంది.
కాగా ఇందుకు వైసీపీ ధీటైన సమాధానం ఇవ్వాలని పెద్ద షాక్ ఇచ్చేసింది.ఇప్పుడు ఏపీలో గురుకులాలకు ఉన్న టీడీపీ నేత, ఎస్సీ దిగ్గజం అయిన బాలయోగి పేరును మార్చేసింది.
ఈ ప్లేస్ లో అంబేడ్కర్ పేరును పెట్టి వివాదం రాజేసింది.అయితే ఈ వివాదం మీద అటు టీడీపీ కూడా భగ్గు మంటోంది.
దీని మీద చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించారు.అంబేడ్కర్ పేరు పెట్టాలనుకున్నప్పుడు బాలయోగి పేరు తొలగించాల్సిన అవసరం లేదంటూ మండిపడ్డారు.
బాలయోగి దళితుల కోసం ఎంతో పోరాడారని గుర్తు చేస్తున్నారు.
ఇంక అక్కడితో వదిలేయకుండా ఇందులోకి వైఎస్సార్ పేరును తీసుకు వచ్చారు.కావాలంటే వైఎస్ఆర్ పేరుతో ఉన్న కార్యక్రమాలకు అంబేద్కర్ పేరు పెట్టాలని, అలా చేస్తే తాము సంతోషిస్తామంటూ చెప్పుకొచ్చారు.అయితే దీనిపై వైసీపీ నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు.
మొత్తానికి వైసీపీ చేసిన పని వివాదాన్ని తెరమీదకు తీసుకు వచ్చిందనే చెప్పొచ్చు.ఏదేమైనా కూడా ఇలాంటి వివాదాలను తెరమీదకు తీసుకు రావడంలో జగన్ ఎత్తుగడ వేరే ఉంటుందనేది కాదనలేని సత్యం.
మరి ఆయన ఏ ప్లాన్ ప్రకారం దీన్ని తీసుకు వచ్చారో తెలియాల్సి ఉంది.