భగవద్గీత అనేది మహాభారతంలో భాగమైన అతి ప్రాచీన ధార్మిక గ్రంథం.ఇది కేవలం ఒక మత గ్రంథం మాత్రమే కాదు.
జీవన విలువలపై, కర్తవ్యంపై, ఆత్మజ్ఞానంపై అద్భుతమైన బోధనల సమాహారం.అర్జునుడి సందిగ్ధతలను తొలగిస్తూ శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశం యుగయుగాలుగా అనేకమంది జీవితాలకు మార్గదర్శిగా నిలిచింది.
భగవద్గీతలోని తత్త్వాలు ప్రపంచవ్యాప్తంగా అనేక మేధావులకు, సాధకులకు ప్రేరణగా నిలిచాయి.భరత ముని రచించిన నాట్యశాస్త్రం( Dance science ) భారతీయ నాట్య కళకు మూలస్తంభం.
ఇందులో నాటకరంగానికి సంబంధించిన శాస్త్రీయ అంశాలు, నటన, నృత్య, సంగీతాలపై అద్భుతమైన వివరణలు ఉన్నాయి.ఈ గ్రంథం ఆధారంగా భారత్లో అనేక కళారూపాలు అభివృద్ధి చెందాయి.
ప్రపంచంలోనే తొలి సమగ్ర నాట్యశాస్త్ర గ్రంథంగా దీనికి గౌరవం లభించింది.

ఇప్పుడు ఈ భగవద్గీత, నాట్యశాస్త్రం లకు యునెస్కో( UNESCO ) నుంచి అత్యున్నత గౌరవం లభించింది.ఈ రెండు గ్రంథాలను యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ ( UNESCO Memory of the World Register )లో చేర్చారు.ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఇప్పటివరకు భారత్ నుండి 14 శాసనాలు ఈ గౌరవప్రదమైన జాబితాలో చేరినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ.ఇది ప్రతి భారతీయుడికీ గర్వకారణమైన క్షణం.భగవద్గీతతో పాటు నాట్యశాస్త్రం యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చేర్చబడటమన్నది భారతదేశం సాంస్కృతిక వారసత్వానికి, శాస్త్రీయ జ్ఞానానికి ప్రపంచ స్థాయిలో లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు.
శతాబ్దాలుగా ఈ రచనలు భారత నాగరికతకు చైతన్యాన్ని ఇచ్చినవని, ఇవి ఇప్పటికీ ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని మోడీ అన్నారు.

భగవద్గీత, నాట్యశాస్త్రం యునెస్కో గుర్తింపు పొందిన ఈ సందర్భం, భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయ గుర్తింపు( International recognition ) లభించిన ఘనతగా నిలుస్తోంది.ఇది ప్రాచీన భారత జ్ఞాన సంపదకు ప్రపంచం ఇచ్చిన గౌరవ సూచకంగా భావించవచ్చు.