ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం అనూహ్యంగా పెరిగిపోయింది.ప్రత్యేకంగా రిల్స్ (Reels), సెల్ఫీలు తీసుకోవడంలో యువత మునిగిపోయారు.
నిత్యం అనేక మంది తమ జీవితాల్లో జరిగే ప్రతి చిన్న విషయాన్నీ వీడియోల రూపంలో తీసి, వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వైరల్ కావాలనే ప్రయత్నం చేస్తున్నారు.అయితే, ఈ ప్రయత్నాల వల్ల వారు తమను తాము మాత్రమే కాకుండా, ఇతరులను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.
బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్సులు (Bus stands, metro stations, airports, buses)నడిచే రహదారులు ఇలా ఎక్కడికైనా వెళ్లినా అక్కడ వీడియోలు తీసుకోవడం ఓ అలవాటుగా మారిపోయింది.ఈ క్రేజ్లో కొంతమంది అడవుల్లోకి, ఎత్తైన జలపాతాల దగ్గరకు, సముద్రతీరాలకు వెళ్లి ప్రాణాలకే ప్రమాదమవుతోన్న రీతిలో వీడియోలు తీస్తున్నారు.
ఇప్పటికే ఇలాంటి ప్రయత్నాల్లో ప్రాణాలు కోల్పోయిన అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.కొంతమంది కేవలం ఫేమస్ కావాలనే ఉద్దేశంతో తమ చుట్టూ ఉన్నవారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.రీల్స్ (Reels)చేస్తూ వివాదాల్లో చిక్కుకునే ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.వాటిలో కొన్ని చట్టపరమైన ముప్పులకు దారి తీస్తున్నాయి.
తాజాగా బెంగళూరులో(Bangalore) చోటుచేసుకున్న ఓ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.మగడి రోడ్డులో ఓ యువకుడు రోడ్డు మధ్యలో చైర్ వేసుకొని కాళ్ల మీద కాలు వేసుకుని టీ(Tee) తాగుతూ రీల్స్ కు ఫోజులు ఇచ్చాడు.ఇది అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం కావటంతో అక్కడినుంచి వెళ్తున్న వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.ఈ వీడియో కొద్దీ సేపట్లోనే నెట్టింట వైరల్ అయ్యింది.వీడియో వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు వెంటనే స్పందించారు.వీడియోలో ఉన్న సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని తగిన చర్యలు తీసుకున్నారు.
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని చేసిన పని చివరికి అతని కొంప ముంచింది.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.ప్రజల ప్రయాణానికి ఆటంకం కలిగించేలా ప్రవర్తించడం తప్పని, ఇలాంటి చర్యలు తక్షణమే అరికట్టాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.సమాజంలో మారుతున్న ట్రెండ్ను అనుసరించడం తప్పు కాదు.
కానీ అది ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు.సోషల్ మీడియా వేదికను వినియోగించుకోవడంలో బాధ్యత కూడా ఉండాలి.
వైరల్ కావడానికే జీవితం పెట్టుబడి పెట్టకూడదు అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి.