అమెరికాను పక్కకునెట్టి పెద్దన్నగా చక్రం తిప్పాలని చూస్తోన్న చైనా పలు దేశాల అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టాలని ప్రయత్నిస్తోంది.ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఒక ఎంపీ ద్వారా గూడఛార్యం చేయించి ఆ దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలని చైనా కుట్రపన్నినట్లుగా కథనాలు రావడంతో ప్రపంచం ఉలిక్కిపడింది.తాజాగా కాలిఫోర్నియాకు చెందిన మాజీ టూర్ ఆపరేటర్ తాను చైనాకు గూఢచర్యం చేస్తున్నట్లు అంగీకరించడం కలకలం రేగింది.
57 ఏళ్ల జుహువా ఎడ్వర్డ్ పెంగ్ అమెరికా రక్షణ సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి అందించినట్లు ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు.అయితే శిక్షను తగ్గించుకునేందుకు గాను పెంగ్ తన నేరాన్ని అంగీకరించాడు.ప్రాసిక్యూటర్లతో ఒప్పందం ప్రకారం నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 30 వేల డాలర్ల జరిమానాకు అతను తన అంగీకారం తెలిపాడు.
అయితే శిక్షా కాలంపై పెంగ్ అభ్యర్ధనను యూఎస్ జిల్లా జడ్జి హేవుడ్ ఎస్ గిల్లియం జూనియర్ నిరాకరించారు.

పెంగ్.ఈ ఏడాది సెప్టెంబర్లో హేవార్డ్లోని తన నివాసంలో అరెస్ట్ అయ్యాడు.అప్పటి నుంచి ఆయన ఫెడరల్ కస్టడీలోనే ఉన్నాడు.
ఈ కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం పెంగ్ సోమవారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యాడు.అతను 2015లో ఒక వ్యాపార పరమైన పని నిమిత్తం చైనాలో పర్యటించాడు.
ఈ సందర్భంగా అక్కడ ఓ అధికారిని సంప్రదించాడని ప్రాసిక్యూటర్లు కోర్టు దృష్టికీ తీసుకొచ్చారు.అమెరికా రక్షణ వ్యవహారాలకు సంబంధించిన రహాస్యాలను చేరవేసేందుకు గాను పెంగ్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిపారు.
ఈ క్రమంలో 2015-18 మధ్య పెంగ్ ఆరు సార్లు చైనాలో పర్యటించాడని ప్రాసిక్యూషన్ వెల్లడించింది.
కాగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చైనా గూఢచారుల సంచారంపై దృష్టి సారించిన ఎఫ్బీఐ సెప్టెంబర్లో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో పెంగ్ను అదుపులోకి తీసుకుంది.
అతను 2001లో తాత్కాలిక వీసాపై అమెరికాలో ప్రవేశించాడని.వివాహం తర్వాత 2006లో చట్టబద్ధమైన శాశ్వత నివాసిగా, 2012లో సహజ అమెరికా పౌరసత్వాన్ని పొందాడు.టూర్ ఆపరేటర్గా పెంగ్ను చైనా పర్యాటకులు, విద్యార్ధులే ఎక్కువగా సంప్రదించేవారని ఎఫ్బీఐ నిఘాలో వెల్లడైంది.