సూర్యాపేట జిల్లా:నాగార్జున సాగర్ ఎడమ కాలువ నిండా నీరు ఉండడంతో కాలువకు గండిపడిన ప్రమాదాన్ని పసిగట్టలేక పోయామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం ముప్పారం వద్ద నిన్న సాయంత్రం సాగర్ ఎడమ కాలువకు పడిన గండిపై స్పందించారు.
కాలువ కట్ట పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని మరో ఐదారు రోజుల్లో తిరిగి ఎడమ కాల్వలో నీటిని పునరుద్ధరిస్తామన్నారు.గండి పడిన ఐదు నిమిషాల వ్యవధిలోనే సంబంధిత అధికారులు గండి పడిన ప్రదేశానికి చేరుకోవడంతో పాటు నీటిని ఆపడానికి కావాల్సిన అన్ని చర్యలు చేపట్టారని అన్నారు.
కాలువ మధ్యలో గండి పడటంతోనే నీరు అధికంగా ఉన్న కారణంగా సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించలేక పోయారన్నారు.లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీటిని కూడా యుద్ద ప్రాతిపదికన బయటకు పంపగలిగమన్నారు.
అకాల వరదతో అదృష్టవశాత్తు పెద్దగా నష్టం జరగలేదని,ఎవరైనా నష్టపోతే వారి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారని,నష్ట పోయిన వారు ఎవరైనా ఉంటే వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.