ఈ మధ్యకాలంలో కొందరికి ప్రతి చిన్న విషయానికి హత్య చేయడం లేదా ఆత్మహత్య చేసుకోవడం బాగా అలవాటు అయింది. తాజాగా ఓ వ్యక్తి పండుగ రోజున కోడి కూర వండి పెట్టలేదని మద్యం మత్తులో తన భార్యపై దారుణంగా దాడి చేసి హతమార్చిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల మండలం పరిసర ప్రాంతంలో సన్నయ్య అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు. ఇతడు గత కొద్ది కాలంగా మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లకు బానిసై ఎలాంటి పనులకు వెళ్ళకుండా ఇంటి వద్దనే కాలం గడుపుతున్నాడు.
అయితే తాజాగా దసరా పండుగ రోజు కూడా ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తనకు కోడి కూర వండి పెట్టాలని తన భార్యని అడగడంతో దసరా పండుగ కావడంతో కోడి కూర వండటం కుదరదని తెగేసి చెప్పింది.
దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి పెద్ద వాగ్వాదం చోటు చేసుకుంది.దీంతో ఈ వాగ్వాదంలో తన భార్యని చేతికందిన ఇనుప రాడ్ తో దాడి చేసి హత్య చేశాడు…
అనంతరం తన ఇంట్లో వాళ్లకి భయపడి అక్కడి నుంచి పరారయ్యాడు.
దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వివాహిత మృతదేహాన్ని పంచనామా నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.అలాగే మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.