సామాజిక మాధ్యమాల్లో “ప్లాస్టిక్ బియ్యం”( Plastic Rice ) పేరిట షేర్ అవుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కలకలం రేపుతున్నాయి.ఉగాది నుంచి తెలంగాణ ప్రభుత్వం( Telangana Government ) ప్రతిష్టాత్మకంగా తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది.
అయితే, ఈ నేపథ్యంలోనే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజల్లో అనుమానాలు, భయాలు కలిగిస్తున్నాయి.సన్న బియ్యం పేరుతో ప్రభుత్వం ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తోందంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.“సన్న బియ్యం అని చెప్పి ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారు రేషన్ షాప్స్ లో” అంటూ పోస్ట్ చేస్తున్నారు.ఈ విషయం వైరల్ కావడంతో పలువురు లబ్ధిదారులు రేషన్ షాపుల( Ration Shops ) నుంచి తీసుకున్న బియ్యాన్ని పరీక్షించడం ప్రారంభించారు.
మరికొంత మంది వాటిని తినాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు.ఈ వీడియోలను కొన్ని పార్టీలు తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.ప్లాస్టిక్ బియ్యం అంటూ వైరల్ అవుతున్న వీడియోల్లో ఎలాంటి వాస్తవం లేదని, అవి పూర్తిగా తప్పుడు ప్రచారమేనని తేల్చి చెప్పింది.
పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ విషయంపై స్పందిస్తూ, బియ్యం పంపిణీలో ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే వారిపై రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సివిల్ సప్లైస్ కమిషనర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.తప్పుడు వీడియోలను షేర్ చేస్తూ ప్రజల్లో భయం, అయోమయం కలిగించే వారిపై చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.ప్రజలను అయోమయంలోకి నెట్టి, సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే దురుద్దేశంతోనే ఈ తప్పుడు ప్రచారం జరుగుతోందని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న సన్న బియ్యం పథకం మీద అపనిందలు మోపేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నట్లు పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, నిజం తెలిసే వరకు సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పౌర సరఫరాల శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.