యూకేలో( UK ) ఇటీవల ఒక అరుదైన, భావోద్వేగంతో కూడిన వైద్య అద్భుతం చోటుచేసుకుంది.అక్కడ ఒక బాబు రెండుసార్లు పుట్టింది.
మొదటిసారి సర్జరీ సమయంలో, రెండోసారి పూర్తి గర్భావధి కాలం ( Full Term ) తర్వాత.ఈ వింత సంఘటన వెనుక అసలు కథేంటో తెలుసుకుందాం.
వివరాల్లోకి వెళ్తే, ఆక్స్ఫర్డ్కు చెందిన 32 ఏళ్ల లూసీ ఐజాక్( Lucy Isaac ) అనే టీచర్ 20 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు ఒక సాధారణ స్కానింగ్లో ఆమెకు అండాశయ క్యాన్సర్ ( Ovarian Cancer ) ఉన్నట్లు గుర్తించారు డాక్టర్లు.ఇది వారికి పెద్ద షాక్గా మారింది.
ఆక్స్ఫర్డ్లోని జాన్ రాడ్క్లిఫ్ హాస్పిటల్ వైద్యులు లూసీని హెచ్చరిస్తూ, క్యాన్సర్కు డెలివరీ తర్వాత చికిత్స అందిస్తే అది వేగంగా శరీరమంతా పాకే ప్రమాదం ఉందని తెలిపారు.
అయితే, లూసీ అప్పటికే గర్భంతో చాలా ముందుకు వెళ్లిపోయారు కాబట్టి, సాధారణ కీహోల్ సర్జరీ ద్వారా క్యాన్సర్ కణితిని తొలగించడం సాధ్యం కాలేదు.
దీంతో డాక్టర్ సోలేమణి మజ్ద్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఒక అరుదైన, చాలా సంక్లిష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చింది.క్యాన్సర్కు చికిత్స చేయడానికి లూసీ గర్భాశయాన్ని, దానిలో ఇంకా ఎదుగుతున్న బాబు రాఫెర్టీతో( Rafferty ) సహా, తాత్కాలికంగా శరీరం నుంచి బయటకు తీయాలని వారు నిర్ణయించారు.
ఈ సమయంలో బాబు సురక్షితంగా ఉండేలా గర్భాశయాన్ని ముఖ్యమైన రక్తనాళాలకు కనెక్ట్ చేసి ఉంచారు.

గత అక్టోబర్లో జరిగిన ఈ ఐదు గంటల సుదీర్ఘ సర్జరీ సమయంలో, వైద్య బృందం లూసీ గర్భాశయాన్ని చాలా జాగ్రత్తగా ఒక వెచ్చని సెలైన్ ర్యాప్లో ఉంచింది.దీనివల్ల పాప రాఫెర్టీ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉండేలా చూసుకున్నారు.ఈ ర్యాప్ను ప్రతి 20 నిమిషాలకు మార్చారు.
ఇద్దరు డాక్టర్లు నిరంతరం పాప పరిస్థితిని పర్యవేక్షించారు.కణితి నమూనాను పరీక్షించి అది గ్రేడ్ టూ క్యాన్సర్గా నిర్ధారించారు.
క్యాన్సర్ కణజాలాన్ని విజయవంతంగా తొలగించిన తర్వాత, గర్భాశయాన్ని తిరిగి లూసీ శరీరం లోపల జాగ్రత్తగా ఉంచి, పొట్ట భాగాన్ని కుట్లు వేశారు.

ఇక్కడ అద్భుతమైన విషయం ఏమిటంటే, గర్భాశయం లూసీ శరీరం బయట ఏకంగా రెండు గంటల పాటు ఉంది.ఇలాంటి కేసులో తాను గర్భాశయాన్ని ఇంత ఎక్కువ సమయం పాటు బయట ఉంచడం ఇదే తొలిసారి అని డాక్టర్ మజ్ద్ తెలిపారు.మొత్తం 15 మంది వైద్య నిపుణులు ఈ క్లిష్టమైన సర్జరీలో పాల్గొన్నారు.
ఇది నిజంగా అరుదైన, సవాలుతో కూడుకున్న వైద్య ప్రక్రియ.
పూర్తి గర్భావధి కాలం తర్వాత, జనవరి చివరి వారంలో బాబు రాఫెర్టీ ఆరోగ్యంగా జన్మించాడు.బరువు 6 పౌండ్లు 5 ఔన్సులు (సుమారు 2.8 కిలోలు).ఈ పుట్టిన క్షణాలు ఆ కుటుంబానికి అత్యంత భావోద్వేగంతో కూడుకున్నవి.లూసీ భర్త ఆడం కూడా 2022లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు.ఇలాంటి క్లిష్టమైన ప్రయాణం తర్వాత ఆరోగ్యకరమైన తమ పాపను చేతుల్లోకి తీసుకోవడం వారికి ప్రపంచమే అయినట్లు అనిపించింది.
ఇటీవల లూసీ ఆసుపత్రిని సందర్శించి డాక్టర్ మజ్ద్ కు ధన్యవాదాలు తెలిపారు.
తనకు సరైన సమయంలో వ్యాధి గుర్తించి, చికిత్స లభించడం తన అదృష్టమని ఆమె పేర్కొన్నారు.