తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు తలనొప్పిగా మారినట్టు కనిపిస్తోంది.పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా రాజ్యసభ స్థానాల కోసం కేసీఆర్, కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఎవరికి వారు తమకు అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు.ఈ నేపథ్యంలో కేసీఆర్ దయ ఎవరిమీద ఉంటుందనేది అందరిలోనూ ఉత్కంఠగా ఉంది.
ఇదే విషయంపై రెండు రోజులుగా ఫార్మ్ హౌస్ లోనే ఉంటూ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఆరో తేదీ నుంచి రాజ్యసభ కు నామినేషన్ లు ఉండడం, అదే రోజున అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దానికి ముందుగానే అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఇప్పటికే కొంతమంది పేర్లు కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, నమస్తే తెలంగాణ ఎండి దామోదరరావు, గ్యాదరి బాలమల్లు ఈ ముగ్గురి పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.వీరిలో కేశవరావు మరోసారి తనకు అవకాశం ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు.
ఇక దామోదర్ రావు కు రాజ్యసభ సీటు ఇస్తానని ఎప్పటి నుంచో కేసీఆర్ హామీ ఇచ్చారు.గతంలో ఒకసారి ఆయనను రాజ్యసభకు పంపించాలని కేసీఆర్ చూసినా ఆఖరి నిమిషంలో సంతోష్ కు అవకాశం దక్కింది.
ఇప్పుడు ఖచ్చితంగా దామోదరరావు కు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.గ్యాదరి బాలమల్లు విషయానికొస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ కు ఎన్ని రకాలుగా అండగా ఉన్నారు.

గతంలోనే రాజ్యసభకు ఎంపిక చేయాలని కెసిఆర్ ప్రయత్నించినా సామాజిక సమీకరణాల నేపథ్యంలో అది కుదరలేదు ఇప్పుడైనా ఆయనకు అవకాశం దొరుకుతుందేమో అని టిఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది.ఇవన్నీ ఎలా ఉంటే కెసిఆర్ కుమార్తె మాజీ ఎంపీ కవిత కు రాజ్యసభ సీటు ఇస్తారా లేదా అనేది అందరిలోనూ ఉత్కంఠ కలిగిస్తోంది.ఆమె రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఒకవైపు, ఆమె రాష్ట్ర మంత్రి అవ్వాలని చూస్తున్నట్లు మరోవైపు ప్రచారం జరుగుతోంది.ఇక జగన్ సిఫార్సుతో తనకు అవకాశం దొరుకుతుందని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు.
అయితే కేసీఆర్ ఈ రెండు స్థానాల్లో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఈరోజు కానీ రేపు గాని తేలిపోయే అవకాశం కనిపిస్తోంది.ఈ లోపుగా ఎవరికి వారు తమ వంతుగా కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.