నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాథ్ సే హథ్ జోడో అభియాన్ పాదయాత్రకు గురువారం స్వల్ప విరామం పడింది.తిరిగి 29న పునఃప్రారంభం కానుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఉదయం కేశవ నగర్ కాలనీ నుండి ప్రారంభించి దుర్గా నగర్,జంకు తండ, వెంకటాద్రిపాలెం,శ్రీనివాస నగర్,సామగాని తండా, తులసి తండా,లావుడి తండా ద్వారా రామన్నపేట వరకు యాత్ర కొనసాగింది.నిన్న రాత్రి పొద్దు పోయేంతవరకు కొనసాగిన పాదయాత్రకు గిరిజన తండాలలో నాయకులు,కార్యకర్తలు మరియు గిరిజనుల అపూర్వ స్పందనతో దిగ్విజయంగా కొనసాగింది.
గ్రామాలలో,తండాలలో పాదయాత్రకు హాజరైన ప్రజలను ఉద్దేశించి లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ… మీరు చూపిస్తున్న ఆదరణ,అభిమానం చూస్తుంటే ఇది నా పూర్వజన్మ సుకృతమని అనిపిస్తున్నదన్నారు.శ్రీనివాస కళ్యాణం పథకం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని వేలమంది చెల్లెల్లను సంపాదించుకున్నాని,కరోనా కష్టకాలంలో చాలా రోజులు పని లేక ఆడపడుచుల పెళ్లిళ్లు చేయడానికి ఆడపిల్లల తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు గమనించి కళ్యాణమస్తు పథకం పెట్టామని తెలిపారు.
సామాజిక సేవ చేస్తున్న మేము మరింత మెరుగైన సేవ చేయడం కోసమే రాజకీయాలలోకి వచ్చామని,కొందరు దళారుల లాగా దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా రాజకీయాలు చేయడం మా అభిమతము కాదన్నారు.మా స్వంత సంపాదన డబ్బులతో సేవే లక్ష్యం – ప్రేమే మార్గం అని ముందుకు సాగుతున్నామన్నారు.
రైతులు ఆరుగాలం పండించిన ధాన్యం ఐకెపి సెంటర్లలో చేర్చితే,ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాంటాలు వేయక పోవడంతో వర్షార్పణం అయిన ధాన్యాన్ని చూసి రైతులు రోదిస్తుంటే,అధికార పార్టీ ప్రతినిధులు,నాయకులు మాత్రం ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఏసి ఫంక్షన్ హాల్ లలో బీర్లు, బిర్యానీలతో తైతక్కలాడుతున్నారని విమర్శించారు.రైతుల మీద మీకు ఉన్న శ్రద్ధ ఇదేనా అని ప్రశ్నించారు.అధికార మదంతో మీరు వ్యవహరిస్తున్న తీరుకు వచ్చే ఎన్నికలలో ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.
కొద్ది రోజులలో రానున్న ఎన్నికలలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ, కౌలు రైతులకు సైతము రైతు బంధు,భూమిలేని ఉపాధి హామీ కూలీలకు నగదు,రేషన్ కార్డులు, కుటుంబంలో అర్హులైన ఇద్దరికీ పెన్షన్,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,రూ.500/- లకే గ్యాస్ సిలిండర్, నిరుద్యోగ భృతి,ఉద్యోగ ఖాళీల భర్తీ చేస్తామని భరోసా కల్పించారు.నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో మిర్యాలగూడలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.