నల్లగొండ జిల్లా: ఈ నెల 7 వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నరుకు ఆహ్వానం లేదని,వారి ప్రసంగం లేదని బీజేపీ చేస్తున్న వాదనలో పసలేదని శాసన మండలి మాజీ చైర్మన్,ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.బుధవారం నల్లగొండలో జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు, బీజేపీ నాయకులకు రాజ్యగం పట్ల కనీస అవగాహన లేదని విమర్శించారు.ప్రారోగ్ కాకుండా అసెంబ్లీ ఎన్నిసార్లైనా సమావేశాలు జరుపుకో వచ్చని, గత సమావేశాలకు కంటిన్యూగానే ఈ సమావేశాలు జరుగుతున్నాయని, అది గమనించని బీజేపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని పేర్కొన్నారు.
ఆరోపణలు చేయడం మంచిది కాదు.గవర్నర్ కు వుండే అధికారాలు గవర్నరుకు ఉంటాయి.
ప్రభుత్వానికి ఉండే అధికారాలు ప్రభుత్వానికి ఉంటాయి.కాంగ్రెస్ పాలనకు మించి బీజేపీ ప్రభుత్వం గవర్నర్లను ఇష్టారీతిన వాడుకుంటోందని ఇది కరెక్ట్ కాదన్నారు.
బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని, బీజేపీ గవర్నర్లను అడ్డం పెట్టుకొని గతంలో చాలా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసిందని గుర్తు చేశారు.అలాంటి బీజేపీకి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు.
ప్రజల్లో గందరగోళం సృష్టించేలా బీజేపీ, కాంగ్రేస్ ప్రవర్తిస్తున్నాయని ఎద్దేవా చేశారు.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఏ విషయంలో కూడా అవగాహన లేదన్నారు.
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంటే అక్కడ ఉన్న భారతీయులను కాపాడటంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు.కాంగ్రెస్ నావ ఎప్పుడు మునుగుతుందో తెలియదని, కాంగ్రెస్ పార్టీ నడి సంద్రంలో నావలాగా మారిందని,ఎప్పుడు సముద్రంలో మునిగిపోతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదన్నారు.
దేశ రాజకీయాల్లో కేసీఆర్ ను మించిన రాజనీతిజ్ఞుడు, పరిపాలనాదక్షుడు ఎవ్వరూ లేరని,వచ్చే ఎన్నికలో కేసీఆర్ ను ఢీకొట్టే నాయకుడు లేడని తేల్చిచెప్పారు.