నల్లగొండ జిల్లా:పరీక్షలు ఏవైనా సరే,ప్రశ్నపత్రాలు ముందుగానే నిక్షేపంగా బయటికొచ్చేసే అవ్యవస్థ, దోపిడి దేశీయంగా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోందని కమ్యూనిస్టు పార్టీ సిపిఐ (ఎంఎల్) సెక్రటరీ కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు.గడచిన ఏడేళ్లలో దేశవ్యాప్తంగా అలా చోటుచేసుకున్న 70కి పైగా లీకేజీలతో సుమారు కోటిన్నర మంది విద్యార్థులు,నిరుద్యోగులు బాధితులైనట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వోద్యోగాలకు ఎంపిక పరీక్షలూ తదితరాలకు సంబంధించి రాజస్థాన్లో 2011-2022 మధ్య కాలంలో 26 సార్లు ప్రశ్నపత్రాలు అంగడి సరకులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.గుజరాత్,ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్,పశ్చిమ బెంగాల్,బిహార్ వంటి రాష్ట్రాల్లోనూ పోటీ పరీక్షలెన్నో లీకుల నేరగాళ్ల పాలబడ్డాయని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ పోస్టుల భర్తీ ప్రక్రియ నుంచి పదో తరగతి,ఇంటర్,పాలిటెక్నిక్ పరీక్షల్లో చీకటి దందాలపై గత నాలుగేళ్లలో కథనాలెన్నో గుప్పుమన్నాయని తెలిపారు.తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో తిష్ఠవేసిన ఇంటిదొంగల బాగోతాలు కొద్దిరోజులుగా వెలుగుచూస్తూ గగ్గోలు పుట్టిస్తున్నాయన్నారు.
తిన్నింటి వాసాలు లెక్క పెట్టినవాళ్ల నీతిమాలినతనం- నాలుగున్నర లక్షల మందికి పైగా హాజరైన గ్రూప్-1 ప్రిలిమ్స్,ఏఈ, ఏఈఈ,డీఏఓ పరీక్షల రద్దుకు కారణమైందని ఆరోపించారు.ఎంతోమంది ప్రతిభావంతుల ఆశలను ఆ ప్రబుద్ధులు స్వార్థమే ఛిద్రంచేసిందని,సర్కారీ కొలువుల కోసం సర్వశక్తులూ ఒడ్డుతూ, సంవత్సరాల తరబడి తల్లిదండ్రులు, బంధుమిత్రులకు దూరంగా ఉంటూ సన్నద్ధమైన యువత-కొద్దిమంది కాసుల కక్కుర్తికి బలిపశువులు కావాల్సి రావడమే విషాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బట్టబయలైన తరువాత రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది.ప్రశ్నపత్రాల చౌర్యం గుట్టుమట్లను వెలికితీయడంలో ‘సిట్‘ పనితీరును పరిశీలిస్తే- తన బాధ్యతలను అది సమర్ధంగా నిర్వర్తిస్తున్నట్లు విదితమవుతోంది.
పక్కాగా ఆధారాల సేకరణతో భవిష్యత్తులో మరెవరూ లీకేజీలకు పాల్పడకుండా నేరగాళ్లను కఠినాతికఠినంగా శిక్షించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.</b
కలలు కరిగి, గుండెలు చెదిరిన నిరుద్యోగులకు అప్పుడే కాస్తయినా సాంత్వన లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.'పరీక్షల అక్రమాలు విద్యారంగ ప్రమాణాలతోపాటు దేశాభివృద్ధిని దెబ్బతీస్తాయని,ఇవియావత్ జాతికీ హానికారకమైనవని పాలకవర్గాలను హెచ్చరించారు.సమకాలీన సాంకేతిక యుగంలో ప్రశ్నాపత్రాల లీకేజీ ముప్పు ఇంకా అధికమైందని ఆరోపించారు.
వివిధ వ్యవస్థల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగమెంత అవసరమో- అప్రమత్తతతో మెలగకపోతే దాంతో ముంచుకొచ్చే ప్రమాదాలూ అంతే భారీగా ఉంటాయన్నది వాస్తవమని,విద్యార్థి,నిరుద్యోగ జేఏసీ గౌరవ అధ్యక్షుడు కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.బలహీనమైన టీఎస్పీఎస్సీ ఐటీ వ్యవస్థ, ఇతర సంస్థాగత లోపాల దన్నుతోనే అక్రమార్కులు చెలరేగిపోయారని,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
రక్షణరంగ ఉద్యోగులు,క్రెడిట్ కార్డులూ పాన్ కార్డుల వినియోగదారులతోపాటు మొత్తం పదిహేడు కోట్ల మంది సున్నిత సమాచారాన్ని అమ్మకానికి పెట్టిన ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు.లక్షల సంఖ్యలో ఎయిరిండియా వినియోగదారులు,రైలు ప్రయాణికుల వివరాలూ కొద్దినెలల క్రితం ఇలాగే బహిర్గతమయ్యాయని, పౌరుల వ్యక్తిగత సమాచార పరిరక్షణకు వందకు పైగా దేశాలు ప్రత్యేక చట్టాలను రూపొందించుకొన్నాయనికేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో ప్రస్తావించారు.
ఆ మేరకు ఇండియాలో పదునైన శాసనమే కొరవడిందని ఆరోపించారు.</b
సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ విద్యార్థుల భవితతో చెలగాటమాడేవారికి చెక్ పెట్టగలిగేలా కొత్త చట్టాలను రూపొందించుకోవడమూ అత్యావశ్యకమని సూచించారు.
ప్రశ్నపత్రాలను లీక్ చేసే దందాసురులకు పదేళ్ల జైలుశిక్ష,భారీ జరిమానాల విధింపుతోపాటు వాళ్ల ఆస్తులను జప్తు చేసేలా కొత్త శాసన నిర్మాణానికి ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.దేశవ్యాప్తంగా కఠినాతి కఠిన చట్టాలను అమలులోకి తీసుకురావడంతో పాటు నగుబాటుకు గురవుతున్న పరీక్షల ప్రక్రియను లోపరహితం చేయడంపైనా ప్రభుత్వాలు దృష్టి సారించాలని,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
ప్రశ్నపత్రాల తయారీ,వాటి భద్రత, పరీక్షల నిర్వహణకు సంబంధించి వ్యవస్థను పటిష్టపరచడంపై మేధావులు, భాగస్వామపక్షాలతో విస్తృతంగా సంప్రతింపులు జరపాలని ప్రభుత్వాలను కోరారు.విస్పష్ట విధివిధానాలు సాకారమైతేనే దేశానికి లాభదాయకంగా ఉంటుందని,ప్రతిభకు పట్టం కట్టడం సాధ్యపడుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా తంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జైబోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 గుర్తు చేశారు.