డయాబెటిస్ లేదా మధుమేహం.ఇటీవల రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందిని కలవర పెడుతున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో ఇదే ముందుంటుంది.
అందులో ఎటువంటి సందేహం లేదు.అయితే మనకు అప్పుడప్పుడు ప్రీ డయాబెటిస్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది.
అసలు ప్రీ డయాబెటిస్ అంటే ఏంటీ.? అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది.సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు నిర్దేశించిన విలువల కన్నా అధికంగా ఉంటే డయాబెటిస్ అంటారు.
అయితే మరీ ఎక్కువగా కాకుండా బోర్డర్ లైన్లో లేదా కొద్దిగా ఎక్కువగా ఉన్నా దాన్ని ప్రీ డయాబెటిస్ అంటారు.
స్పష్టంగా వివరించి చెప్పాలంటే డయాబెటిస్ రావడానికి ముందు ఉండే స్టేజ్నే ప్రీ డయాబెటిస్ అంటారు.ప్రీ డయాబెటిస్ కు మరో పేరు బోర్డర్ లైన్ డయాబెటిస్.దీని లక్షణాలను గనుక పసిగట్టి ముందే జాగ్రత్త పడితే మధుమేహం రాకుండా అడ్డుకోవచ్చు.ప్రీ డయాబెటిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.
నిద్రలేమి, తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లడం, నోరు తడారిపోవడం వంటివి కొందరిలో కనిపిస్తుంటాయి.అలాగే చర్మంపై అక్కడక్కడ నల్లటి మచ్చలు రావడం, అధిక దాహం, విపరీతమైన ఆకలి, అలసట, కంటి చూపు సన్నగిల్లడం కూడా ప్రీ డయాబెటిస్ లక్షణాలే.
ఈ లక్షణాలు మీలో ఉంటే ఖచ్చితంగా డయాబెటిస్ ఉందని అర్థం కాదు.కానీ, ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ దీర్ఘకాలిక వ్యాధిని రాకుండా అడ్డుకోవచ్చు.
ఇక జాగ్రత్తలు అంటే మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు.రెగ్యులర్గా కనీసం ఓ ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు వ్యాయామాలు చేయాలి.చక్కెర, చక్కెరతో తయారు చేసిన ఆహారాలు, మైదా, పాలిష్ చేసిన తెల్ల బియ్యం వంటి వాటిని దూరం పెట్టాలి.కంటి నిండా నిద్రపోవాలి.శరీరానికి సరిపడా నీటిని అందించాలి.డైట్లో తాజా పండ్లు, ఆకుకూరలు, ఆకుపచ్చ కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు ఉండేలా చూసుకోవాలి.
ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.ధూమపానం, మద్యపానం అలవాట్లను వదులుకోవాలి.
తద్వారా మధుమేహానికి దూరంగా ఉండొచ్చు.