సూర్యాపేట జిల్లా:ఉద్యమాలలో కఠినాతి కఠినమైనది ఏదైనా ఉందీ అంటే అది అహింసాయుత ఉద్యమమమేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.అటువంటి ఉద్యమాన్ని ఆయుధంగా మార్చుకుని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పెగిలించి సువిశాల భారతావనికి స్వాతంత్ర్యం సాధించిన యోధుడు మహాత్మా గాంధీ అని ఆయన కొనియాడారు.
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఆదివారం రాత్రి ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాన్క్ బండ వద్ద ఏర్పాటు చేసిన జానపద కళా ప్రదర్శనలో పాల్గొని మాట్లాడుతూ.బారిస్టర్ విద్యానభ్యసించేందుకు దక్షిణ ఆఫ్రికాకు వెళ్లిన గాంధీజీ తన దేశం వివక్షతకు,అణిచివేతకు గురువౌతుందని గ్రహించి 784 దేశాలుగా ఉన్న భారతావనిని ఏకతాటి మీదకు తెచ్చేందుకు ఎంచుకున్న మార్గమే అహింసాయుత ఉద్యమం అన్నారు.
పరదేశీయుల పాలనను అంతమొందిస్తేనే దేశానికి విముక్తి జరిగి భారతీయుల స్వేచ్చా,స్వాతంత్ర్యాలు పొందవచ్చని నమ్మిన మహానుభావుడు బాపూజీ అని,హింస ద్వారా ఏదీ సాధించలేమని ప్రపంచానికే అహింసాయుత మార్గాన్ని పరిచయం చేసిన సమరయోధుడు గాందీ మహాత్ముడు అని కొనియాడారు.అటువంటి సమర యోధుల స్పూర్తితో సాధించుకున్న స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను నేటి తరానికి అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
స్వాతంత్ర్యం సాధించడంతో సరిపెట్టకుండా భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగ ఆవశ్యకతను గుర్తించి రాజ్యాంగ రచన బాధ్యతలను బాబా సాహెబ్ అంబెడ్కర్ కు అప్పగించారని ఆయన గుర్తు చేశారు.తద్వారా దేశంలో మరో పోరాటానికి ఆస్కారం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందేలా మార్గదర్శనం చేసిన మహానుభావుడని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
అటువంటి మహాత్మా గాంధీ చరిత్రను మలినం చేసేందుకు దుష్టశక్తులు నీచ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.తద్వారా దేశాన్ని మళ్ళీ మధ్యాయుగంలోకి నెట్టే ప్రయత్నాలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
అటువంటి స్వాతంత్ర్య సాధన చరిత్రను నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నదన్నారు.స్వాతంత్ర్యం వచ్చాక ప్రస్తుతం మూడో తరం ఆవిర్భవించిందన్నారు.
అటువంటి విద్యార్థి, యువతకు ఉద్యమం తీరుతెన్నులు,స్వాతంత్ర్య సమరయోధులు పడిన శ్రమను వివరించాలని ఆయన కోరారు.స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయలని ఆయన పిలుపునిచ్చారు.
జాతీయ జెండా ప్రాశస్త్యం వర్తమాననికి తెలియ జెప్పాలని ఆయన సూచించారు.ఆత్మగౌరవానికి ప్రతీకగా త్రివర్ణ పతాకాన్ని ఎద ఎదన నిలిపిన రోజునే సమరయోధుల ఆశయాలను సాధించిన వరమౌతామన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ,జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.