సూర్యాపేట జిల్లా:వేసవిలో గత వారం రోజులుగా గ్రామంలో నీళ్లు రావడం లేదని ఆగ్రహించిన గ్రామస్తులు ఆ రోడ్డు గుండా నియోజకవర్గ ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకొని ప్రధాన రహదారిపై ముళ్ళకంచె వేసి ఎమ్మెల్యే వాహన శ్రేణిని అడ్డుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే కోదాడ నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి మండల కేంద్రంలో గత వారం రోజులుగా నీటి సరఫరా కావడం లేదు.
ఈ విషయమై గ్రామ పంచాయతీ పాలక మండలికి,అధికారులకు విన్నవించినా తమ గోడు ఎవరూ పట్టించుకోక పోవడంతో వేసవిలో గ్రామస్తులు అల్లడిపోయారు.తమ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండగా ఆ మార్గంలో నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వస్తున్నారని సమాచారం రావడంతో స్థానికులు రోడ్డుపైకి చేరుకుని,ఎమ్మెల్యేకు తమ గోడు చెప్పుకునేందుకు రహదారిపై ముళ్ళకంచె వేసి అడ్డుకున్నారు.
దీనితో అక్కడ ఆగిన ఎమ్మెల్యేతో తమకు వారం రోజులుగా నీళ్ళు రావడం లేదని, అధికారులు పట్టించుకోవడం లేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు.సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.