నల్లగొండ జిల్లా:నమ్మిన పార్టీనీ,నమ్ముకున్న ప్రజలను అమ్ముకున్న వంచకుడు రాజగోపాల్ రెడ్డి అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.అమ్ముకోవడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు పెట్టింది పేరని ఆయన చెప్పారు.
తెలంగాణా ఉద్యమ సమయంలోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వంచన చేరి తెలంగాణాకు ద్రోహం చేసిన చరిత్ర వీరిదన్నారు.శుక్రవారం ఉదయం మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ అద్యక్షుడు దాసరి లక్ష్మయ్యతో సహా ఆయన అనుచరులు,వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్ లో చేరారు.
ఇప్పటికే గ్రామ సర్పంచ్,ఎంపిటిసిలు గులాబీ గూటికి చేరిన విషయం విదితమే.ఆ క్రమంలోనే యావత్ ముష్టిపల్లి గ్రామం ఏకమై జై తెలంగాణ అంటూ టిఆర్ఎస్ లో చేరిపోయారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వైఎస్ సొంత జిల్లా కడపకు తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తుంటే పెదవులకు పదవులు అడ్డుపడి నోరుమెదపని నేతలని ఆయన విమర్శించారు.రాజీనామా చేస్తే ఉప ఎన్నికలే వస్తాయని, రాజగోపాల్ రెడ్డి చెబుతున్నట్లు అభివృద్ధి కోసమే రాజీనామా అయితే ఆయనతో పాటు అదే పార్టీ నుండి గెలిచి మిగిలిన నలుగురు ఎందుకు రాజీనామాలు చేయలేదని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా అన్నది ప్రజలకు తెలిసిపోయిందన్నారు.నియోజకవర్గ ప్రజలు వేసిన ఓట్లతో శాసనసభ్యుడిగా గెలిచి ప్రజల నమ్ముకున్న ప్రబుద్ధుడు రాజగోపాల్ రెడ్డి అని ఆయన దుయ్యబట్టారు.
ఏమరుపాటుగానైనా బిజెపికి ఓటేస్తే మోటర్లకు మీటర్లు రావడం ఖాయమన్నారు.అంతే గాకుండా సాగునీరు,త్రాగునీరు కై మళ్ళీ తండ్లాటలు మొదలవుతాయని ఆయన హెచ్చరించారు.
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు గడుస్తున్నా కృష్ణా జలాల్లో మన వాటా తేల్చనియకుండా అడ్డుపడుతున్నందుకే రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరారా అంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ శాసనసభ్యులు రవీంద్ర నాయక్,నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,జడ్పిటిసి ఏ.వి.రెడ్డి,మర్రిగూడ ఎంపీపీ శ్వేతా రవీందర్ రెడ్డి,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రవీందర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు నరసింహ రావు,గ్రామ సర్పంచ్,ఎంపిటిసి తదితరులు పాల్గొన్నారు.