నల్లగొండ జిల్లా:ప్రజాస్వామిక దేశంలో భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నదని,రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడితే చట్ట పరిధిలో పరిష్కారం చేసే జ్యుడీషియరీ ఉందని,దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్ తిలోదకాలిచ్చి పార్టీ కార్యకర్తలచే వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వై.ఎస్.
షర్మిల ప్రచార రథాన్ని తగులబెట్టించి,పాదయాత్రికులపై అమానుషంగా దాడి చేయించడం ఎంత వరకు సబబని,వైఎస్ షర్మిలే కాదు,ఏ నాయకత్వంపై కూడా దాడి జరగడానికి వీలులేదని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకట్ స్వామి అన్నారు.బుధవారం నకిరేకల్ పట్టణంలోని శకుంతల ఫంక్షన్ హాల్లో జరిగిన పీఆర్ పీఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని షర్మిల తిట్టినందుకే ఇలా చేశామని చెప్పడం రౌడీయిజానికి పరాకాష్ట మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమం నడిపి,అధికారంలోకి వచ్చామని చెప్పే టీఆర్ఎస్ నాయకులు నాటి ఉద్యమ సమయంలో అధికారంలో ఉన్న సీమాంధ్ర పాలకులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారా అని ప్రశ్నించారు.అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదని,అధికారం ముసుగులో ఏది చేసినా చెల్లుబాటు కాదని హితవు పలికారు.
టీఆర్ఎస్ నాయకులు చేసిన అమానుష చర్యలను ప్రజలు అంగీకరించడం లేదని, దీనికి సరైన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఈ సమావేశంలో కె.నాగేందర్ రెడ్డి,కొండా నాగరాజు గౌడ్,కవాటి మధుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.