నల్లగొండ జిల్లా: కబ్జాకు కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది కొందరి అక్రమార్కుల వైఖరి.ప్రభుత్వ,ప్రైవేట్ భూములే కాదు చివరికి పాఠశాల స్థలాన్ని కూడా వదలకుండా అక్రమంగా కడీలు పాతి మింగెందుకు సిద్ధమైన సంఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం చిట్టెంపాడు గ్రామంలో వెలుగు చూసింది.
విషయం తెలుసుకొని శనివారం గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అక్కడి పరిస్థితిని పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1997లో పాఠశాల కోసం ఒక దాత ఈ స్థలం ఇచ్చారని, స్థలం ఇచ్చిన దాత మరణించి కూడా 20 సంవత్సరాలు అయిందన్నారు.
ఇప్పుడు ఆ స్థలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తూ స్కూల్ ముందు నుంచి వెనుక ఖాళీ స్థలం వరకు కడీలు పాతారని ఆరోపించారు.ప్రభుత్వ పాఠశాలను ఎద్దుల పాక చేశారని,పిల్లలు ఆడుకునే స్థలాన్ని కబ్జా చేశారని,
పిల్లలు చదివే దేవాలయం లాంటి పాఠశాలను కూడా వదిలిపెట్టడం లేదని, నాంపల్లి మండలంలో భూకబ్జాలు విచ్చలవిడిగా జరుగుతున్నా ఒక్క అధికారి కూడా నోరు మెదపడం లేదని, అధికారులపై ఏమైనా ఒత్తిడి ఉందా? లేక కబ్జాదారుల వద్ద ఏమైనా పుచ్చుకుని మౌనవ్రతం చేస్తున్నారా?అని ప్రశ్నించారు.ఏదీ ఏమైనా పాఠశాల స్థలంలో అక్రమంగా కడీలు పాతి ఆక్రమించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.