కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.18 ఏళ్లు పైబడిన వారందరికీ రికార్డు స్థాయిలో వ్యాక్సిన్ అందిస్తున్నాయి.కానీ కొన్ని చోట్ల మాత్రం వ్యాక్సినేషన్లో భారీ తప్పిదాలు వెలుగుచూస్తున్నాయి.తాజాగా కూడా జరిగిన ఒక తప్పిదం అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది.ఒక ఆరోగ్య అధికారి ఒక వృద్ధురాలికి కేవలం 30 నిమిషాల్లోనే రెండు డోసుల వ్యాక్సిన్ వేసి షాకిచ్చారు.ఈ తప్పిదం కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాలోని అలువా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది.
తుండమ్మ అనే 84 ఏళ్ల వృద్ధురాలు తన కుమారుడితో కలిసి వ్యాక్సిన్ వేయించుకోవడానికి అలువా ఆసుపత్రికి వచ్చింది.మొదటి డోసు తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయింది.
అయితే చెప్పులు మరిచిపోవడంతో తెచ్చుకోవడానికి మళ్లీ ఆసుపత్రికి వచ్చింది.అయితే అక్కడే టీకా అందించే వైద్య అధికారి ఉన్నాడు.
ఆమె రాకను చూసి లోపలికి పిలిచాడు.వ్యాక్సిన్ తీసుకోవాలంటూ ఆమెకు చెప్పాడు.
కానీ తాను అరగంట క్రితమే మొదటి డోసు తీసుకున్నారని ఆమె చెప్పింది.అయినప్పటికీ ఆ అధికారి మాత్రం వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని ఆమె మాటలు పట్టించుకోకుండా కుర్చీలో కూర్చోబెట్టి మరీ టీకా వేశాడు.
దాంతో పాపం ఆ వృద్ధ మహిళ తీవ్ర ఆందోళనకు గురైంది.కొంత సమయం తర్వాత అసలు విషయం తెలుసుకున్న అక్కడి వైద్య సిబ్బంది కూడా షాక్ అయ్యింది.
ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందో చెక్ చేసేందుకు గంట పాటు అక్కడే ఉండాలని కోరింది.

అయితే గంట సేపటి తర్వాత కూడా ఆమెలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరిపీల్చుకుంది.ఇక ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి సురక్షితంగానే వెనుదిరిగింది.కరోనా టీకా డోసుల మధ్య నిర్ణీత వ్యవధి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది.
కానీ వైద్యులు మాత్రం పూర్తి నిర్లక్ష్యంతో ప్రజలకు ఇష్టం వచ్చినట్లు వ్యాక్సిన్లు వేస్తున్నారు.అరగంట వ్యవధిలోనే రెండు డోసులు వేయడం వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని స్థానికులు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.