చాలా మంది మద్యానికి బానిసలైపోతుంటారు.ఏ మాత్రం మద్యం తాగకపోయినా, వారి పరిస్థితి అస్సలు బాగోదు.
కాళ్లూ చేతులూ వణుకుతున్నాయని, మందు గొంతులోకి వెళ్తేనే మామూలు మనుషులు అవ్వడం అక్కడక్కడా చూస్తుంటాం.కొందరికి ముక్క లేనిదే అన్నం తినలేరు.
ఇంకొందరు మందు లేనిదే ఏ పనీ చేయలేరు.అంతలా మద్యానికి అలవాటు పడిపోతారు.
అయితే మనుషుల విషయం ఎలా ఉన్నా ఓ కోడి పుంజు వ్యవహార శైలి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.మద్యం లేకపోతే అసలు తిండి తినడం లేదు.
ఈ తాగుబోతు కోడిపుంజుకు రోజూ బ్రాందీ వేస్తేనే దానికి పెట్టిన తిండి తింటోంది.లేకపోతే అస్సలు దాని మేత వైపు చూడడం లేదు.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
మహారాష్ట్ర భంధారా జిల్లాలోని పిప్రి గ్రామంలో భావు కటోర్ అనే వ్యక్తి వృత్తి రీత్యా రైతు.
ఆయనకు కోళ్ల పెంపకం అంటే కూడా ఆసక్తి.వివిధ జాతుల కోళ్లను వారు పెంచుతున్నారు.
అయితే తాము పెంచే ఓ కోడి వ్యవహార శైలిపై వారు ఆందోళన చెందుతున్నారు.ఈ కోడికి ‘మారి’ అనే వ్యాధి సోకింది.
అది నయం కావాలంటే మద్యం తాగించాలని కొందరు సూచించారు.దీంతో కొంత విదేశీ లిక్కర్ దానికి పట్టించారు.
ఆ వెంటనే కొంత కాలానికి దాని వ్యాధి నయం అయింది.బాటిల్లో పావు వంతు మద్యం అది తాగేస్తోంది.
మొదట్లో సరదాగా పట్టించినా, ప్రస్తుతం అది తన యజమానులకు చుక్కలు చూపిస్తోంది.నెలకు రూ.2 వేల మద్యాన్ని ఆ కోడి తాగేస్తోంది.
కోడికి వచ్చిన ఈ వ్యసనాన్ని పోగొట్టేందుకు వివిధ ప్రయత్నాలను ఆ వ్యక్తి చేస్తున్నాడు.దానిని వెటర్నరీ వైద్యులకు కూడా చూపించాడు.అదేమీ పెద్ద సమస్య కాదని, మందు మాన్పించే టాబ్లెట్లను వాడితే మద్యం తాగడం మానేస్తుందని వారు అభయం ఇచ్చారు.
దీంతో కొంత ఊరట చెందాడు ఆ రైతు.ప్రస్తుతం ఆ కోడికి మందు మాన్పించే ప్రయత్నాల్లో ఉన్నాడు.స్థానిక లిక్కర్ దొరకకపోవడంతో విదేశీ లిక్కర్ పట్టించానని, దానికి ఆ కోడి బాగా అలవాటు పడిపోయిందని వాపోతున్నాడు.మద్యం తాగకపోతే కనీసం మంచి నీళ్లు కూడా తాగడం లేదని ఆవేదనతో చెబుతున్నాడు.