బిట్ కాయిన్ తెలుసు కదా.గతేడాది ప్రపంచం మొత్తాన్ని కుదిపేసిన ఈ క్రిప్టో కరెన్సీ.
ఆ తర్వాత భారీగా పతనమైంది.అయితే ఇదే బిట్కాయిన్కు చెందిన ఎక్స్చేంజ్ నడిపిస్తున్న కెనడా దేశస్థుడు అనుమానాస్పదంగా మృతి చెందడం ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారిపోయింది.అతని మరణం సుమారు రూ.1770 కోట్లను ఎవరికీ దక్కకుండా చేసింది.

కెనడాకు చెందిన గెరాల్డ్ డబ్ల్యూ.కాటెన్ అనే వ్యక్తి క్వాడ్రిగా సీఎక్స్ అనే క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ను ప్రారంభించాడు.ఇందులో చాలా మంది ఖాతాలు తెరిచారు.ఈ ఖాతాల నిర్వహణ, నిధులను ట్రాన్స్ఫర్ చేసే పనులన్నీ గెరాల్డే చూసుకునే వాడు.ఈ పాస్ట్వర్డ్స్ అతనికి తప్ప మరెవరికీ తెలియదు.అయితే అతడు గతేడాది భారత పర్యటనకు వచ్చి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు.
దీంతో అప్పటి వరకూ ఖాతాల్లో జమయిన 25 కోట్ల డాలర్లు (సుమారు రూ.1770 కోట్లు) అలాగే ఉండిపోయాయి.వాటిని ఖాతాదారులకు ఇవ్వాలంటే పాస్వర్డ్ తెలియాల్సిందే.గెరాల్డ్ తన భార్యకు కాదు కదా.కంపెనీలో ఎవరికీ దీనిని తెలియకుండా దాచాడు.ఇప్పుడతడు హఠాత్తుగా మరణించడంతో తమ డబ్బు పోయిందని ఖాతాదారులు లబోదిబోమంటున్నారు.

అంతేకాదు అసలు అతను నిజంగానే చనిపోయాడా లేక ఈ డబ్బు కొట్టేయడానికి ఇలా నాటకం ఆడుతున్నాడా అన్న సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.అందుకే అతని శవాన్ని వెలికి తీసి రీపోస్ట్మార్టం చేయాలని కూడా వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.గెరాల్డ్ నిజంగానే చనిపోయాడు అనడానికి తమకు ఆధారం కావాలని అడుగుతున్నారు.
స్థానిక సుప్రీంకోర్టులోనూ కేసు వేయడంతో గెరాల్డ్ మృతదేహాన్ని వెలికి తీసి అతని గుర్తింపు, చనిపోవడానికి కారణం తెలుసుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
అతడు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం, దీనివల్ల పెట్టుబడిదారులకు కలిగిన నష్టం, అసలు చనిపోయింది అతడేనా అని తెలుసుకోవడానికి ఈ రీపోస్ట్ మార్టం అవసరం అని కోర్టు అభిప్రాయపడింది.