ఇటీవల ఏపీ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే కేంద్రమంత్రి కిషన్రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారనే విషయం బయటపడుతుంది.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమంలో అన్నీ తానై వ్యవహరించారనే పేరు కిషన్రెడ్డికి వచ్చింది.
ఆయన ప్రతిపక్ష నాయకుల నుంచి అధికార పార్టీ నేతల వరకు అందరినీ సమన్వయం చేసుకున్నారు.ప్రతి ఒక్కరినీ కలుపుకుని ముందుకు సాగారు.
ప్రధాని మోదీకి స్వయంగా బ్రీఫింగ్ కూడా ఇచ్చారు.
అటు రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు కూడగట్టడంలో కూడా కిషన్రెడ్డి కీలక పాత్ర పోషించారు.
రాష్ట్రపతి ఎన్నికల విషయంలో నిన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న బీజేపీ టీడీపీ నేతలను ఒకే వేదికపైకి తీసుకువచ్చారు.తొలుత రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించింది.
కానీ టీడీపీ మాత్రం రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతోనే ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు తెలిపిందని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు.
ఒకే విషయానికి సంబంధించి అటు వైసీపీని, ఇటు టీడీపీని మేనేజ్ చేయడం మాములు విషయం కాదు.ఈ విషయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి విజయం సాధించారనే చెప్పాలి.

ప్రస్తుతం ఏపీలో జనసేనతో కలిసి బీజేపీ పొత్తులో ఉంది.ఇలాంటి సమయంలో ఆ పార్టీని వదిలేసి వైసీపీ, టీడీపీలను ఒకేత్రాటిపైకి తీసుకురావడం ఆసక్తి రేపుతోంది.సాధారణంగా ఏపీ నుంచి కేంద్రంలో ఒకళ్లు అయినా కేంద్రమంత్రిగా వ్యవహరిస్తారు.2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి హరిబాబు, టీడీపీ నుంచి అశోక్గజపతిరాజు, సుజనా చౌదరి కేంద్రమంత్రులుగా ఉన్నారు.అయితే 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగడం, ఆ పార్టీ ఘోరంగా పరాజయం కావడంతో ఈసారి కేంద్రమంత్రులు ఎవరూ లేరు.

అయితే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మాత్రం కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు.ఇటీవల కాలంలో రాజకీయ పరంగా ఆయన దూకుడు చూపిస్తున్నారనే టాక్ పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది.2024 ఎన్నికలకు ముందు కూడా ఏపీ రాజకీయాలకు సంబంధించి కిషన్రెడ్డి చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.అన్నీ సెట్ అయితే టీడీపీ, బీజేపీ, జనసేనను ఒకేత్రాటిపైకి తెచ్చి పొత్తు రాజకీయాలు కుదిర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.