ఏపీ అధికార పార్టీ వైసిపికి జనాల్లో పెరుగుతున్న వ్యతిరేకత ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం బలహీనంగా ఉండడం ఇవన్నీ తనకు బాగా కలిసి వస్తున్నాయనే లెక్కల్లో జనసేన పార్టీ ఉంది.బీజేపీతో పొత్తు ఉన్నా.
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే ఒత్తిళ్లు తీవ్రంగా వస్తున్నా, జనసేన మాత్రం ఏపీలో సొంతంగా బలపడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.సొంతంగా బలపడేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది.
అందుకే ప్రాంతాల వారీగా ప్రత్యేక దృష్టి పెట్టింది.అసలు 2019 ఎన్నికల్లో జనసేన కు ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడం వెనుక వైసీపీ గాలి ఎక్కువగా ఉండడమే కారణమని , కానీ ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో 2024 ఎన్నికల్లో తమకు అవకాశం దక్కుతుందని ఆ పార్టీ భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరికలను ప్రోత్సహించేందుకు ప్లాన్ చేస్తోంది.
దీనిలో భాగంగానే ఉత్తరాంధ్ర పై ఇప్పుడు జనసేన పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.
ఈ మేరకు జనసేన పార్టీ కీలక నాయకుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఇప్పుడు ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.ఈ మేరకు జనసేన పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.
ఉత్తరాంధ్ర యాత్రలో పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలతో నాగబాబు సమావేశం కాబోతున్నారు.జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో కి తీసుకువెళ్లి బలోపేతం చేయాలనే విషయంపై పార్టీ శ్రేణులతో చర్చించనున్నారు.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలో జనసేనకు ఆదరణ క్రమక్రమంగా పెరుగుతోంది.వైసీపీలో అసంతృప్తితో ఉన్నవారు, టిడిపిలో సరైన రాజకీయ ప్రాధాన్యత లేని వారు ఇప్పుడు చాలామంది జనసేన లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ లిస్టులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు చాలామంది ఉండటంతో సరైన సమయం చూసి వారిని పార్టీలో చేర్చుకునేందుకు జనసేన ప్రయత్నిస్తోంది.ఇక పవన్ సైతం 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తుండటం తోనే ఈ స్పెషల్ ఫోకస్ పెట్టడానికి కారణంగా తెలుస్తోంది.